Vijayawada: ఇంటికి సేఫ్గా తేజస్విని.. కటకటాల్లోకి అంజాద్
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలతో... మిస్టరీగా మారిన యువతి మిస్సింగ్ కేసును ఛేదించిన బెజవాడ పోలీసులు... కేటుగాణ్ని కటకటాల్లోకి నెట్టారు. ఇక ఏపీకి ఎవరూ వచ్చినా సురక్షితంగా, ధైర్యంగా ఉండాలని ఆకాంక్షించారు పవన్ కల్యాణ్. అయితే ఆడబిడ్డలు అదృశ్యం కావడం బాధాకరమన్నారు. ఇలాంటి కేసులపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆయన వ్యాఖ్యలు, యాక్షన్స్ చూస్తుంటే విమెన్ సేఫ్టీపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తుంది.
![Vijayawada: ఇంటికి సేఫ్గా తేజస్విని.. కటకటాల్లోకి అంజాద్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/azmad.jpg?w=1280)
9 నెలల సుదీర్ఘ విచారణ తర్వాత పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన యువతి మిస్సింగ్ కేసు సుఖాంతమైంది. అదృశ్యమైన తేజస్వినిని సేఫ్గా తల్లి చెంతకు చేర్చారు పోలీసులు. యువతిని ట్రాప్ చేసి తీసుకెళ్లిన కేటుగాణ్ని.. జైల్లో వేశారు. అంతేకాదు, ఆ అతడి క్రైమ్ హిస్టరీ వ్యవహారాలన్నీ బయటకు తీస్తున్నారు. ఇక,ఈ మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ ఇస్తూ… తనను అంజాద్ బెదిరించి తీసుకెళ్లాడంటూ.. మాచవరం పోలీసులకు కంప్లైంట్ చేసింది తేజస్విని. దీంతో, అంజాద్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. నేడు నిందితుడ్ని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు పోలీసులు.
గత నెల 22న మంగళగిరిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రజాదర్బార్ నిర్వహించారు. అక్కడ.. తమ కుమార్తె ఆచూకీ తెలియక 9 నెలలు అవుతోందని ఓ మహిళ పవన్ని కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. తన చిన్న కుమార్తెను ప్రేమ పేరుతో ఆమె సీనియర్ ట్రాప్ చేసి తీసుకెళ్లాడని కన్నీరు పెట్టారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా లాభం లేకపోయిందని వాపోయారు. వెంటనే స్పందించిన పవన్ కల్యాణ్ మాచవరం సీఐ గుణరాముకు నేరుగా ఫోన్ చేసి మాట్లాడారు. దర్యాప్తు వేగం పెంచి బాలిక ఆచూకీ కనిపెట్టాలని ఆదేశించారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశంతో కదిలిన విజయవాడ పోలీసులు తిరిగి దర్యాప్తు ప్రారంభింఛారు. యువతి జమ్మూలో ఉన్నట్లుగా కుటుంబ సభ్యుల నుంచి ప్రాథమిక సమాచారం అందుకుని అక్కడకు వెళ్లారు. అక్కడ ఇద్దరినీ తమ ఆధీనంలోకి తీసుకుని జమ్మూ స్టేషన్కు తీసుకొచ్చారు. తర్వాత విమానంలో విజయవాడకు తీసుకువచ్చారు.
– ఏపీ పోలీసులు సమర్థవంతంగా పనిచేసి 9నెలల క్రితం అదృశ్యమయిన యువతిని 9 రోజుల్లో ట్రేస్ చేసి తీసుకువచ్చారని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. ఇకపై.. మిస్సింగ్ కేసులను ట్రేస్ చేయడానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తామని పవన్ ప్రకటించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…