సౌదీ అరేబియాలో ఈ ఏడాది ఎండలు దంచికొడుతున్నాయి.. 50డిడ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.. తీవ్రమైన వేడి.. ఉక్కపోతలో మాడిమసైపోతున్నారు.. ఈ తీవ్రమైన ఎండల్లోనే హజ్ యాత్ర కొనసాగింది.. ఎండ వేడిమికి హజ్ యాత్రకు వెళ్లిన 1300 మందికి పైగా యాత్రికులు మరణించారు. వారిలో 83 శాతం మంది చట్టవిరుద్ధంగా మక్కాకు వచ్చినవారేనని అధికారులు చెబుతున్నారు. చనిపోయిన వారిలో 98 మంది భారతీయులు కూడా ఉన్నారు. ఈ ఏడాది హజ్ యాత్రకు దాదాపు 22 దేశాల నుంచి పది లక్షల మంది యాత్రికులు రాగా.. సౌదీ అరేబియా పౌరులు 2 లక్షల మందికిపైగా హాజరయ్యారు. ఈజిప్టు నుంచి మరో 10 లక్షలకుపైగా ముస్లింలు తరలివచ్చారు. అయితే ఎండలు, వేడి గాలుల వల్ల యాత్రికులు ఉక్కపోతతో ఊపిరాడక చనిపోయారు. మరణాలు సంభవించిన రోజున రికార్డు స్థాయిలో 53 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
మొత్తం 1301 మంది మరణించగా.. వారిలో 660 మందికి పైగా ఈజిప్టు వాసులు ఉన్నారు. 31 మంది మినహా మిగతావారంతా అక్రమంగా హజ్ యాత్రకు వెళ్లినవారే..అయితే చట్టవిరుద్ధంగా హజ్ యాత్రకు వచ్చిన అనేక మందిని సౌదీ అధికారులు వెనక్కి పంపారు. కొంత మంది ఎలాగోలా మక్కా సహా సమీప ప్రాంతాల్లోని పవిత్ర స్థలాలకు చేరుకున్నారు. అయితే.. వారు ఉండడానికి హోటళ్లు, గూడారులు సహా ఎలాంటి వసతులు లేవు. దీంతో ఎండతాపం నుంచి కాపాడుకునేందుకు వారికి మార్గమే లేకుండా పోయింది. దీనివల్లే మరణాలు ఎక్కువైనట్లు అధికారులు చెబుతున్నారు.
హజ్ యాత్ర చరిత్రలో మరణాలు కొత్తేమీ కాదు. ఐదు రోజుల హజ్ యాత్ర కోసం ప్రతి ఏడాది ఏటా దాదాపు 20 లక్షల మంది వరకు సౌదీకి వెళ్తారు. 1990లో హజ్యాత్ర సందర్భంగా 1426 మంది చనిపోయారు. 2015 లో మీనాలో తొక్కిసలాట జరిగి 2400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈసారి హీట్వేవ్తో అత్యధిక మంది ప్రాణాలు కోల్పోయారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..