Telangana Lockdown: ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. ఈ సమావేశంలో లాక్డౌన్పై కీలక నిర్ణయం తీసుకుంది. మరో 10 రోజుల పాటు లాక్డౌన్ పొడిగించింది. అలాగే ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు లాక్డౌన్ సడలింపు ఇచ్చింది ప్రభుత్వం. ముఖ్యంగా లాక్డౌన్ మూడో విడతపై గత నెల 30న మంత్రి మండలి సమావేశమైంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వెసులుబాటు కల్పించింది. ఆ తర్వాత ఇళ్లకు చేరుకునేందుకు గంటసేపు అనుమతించింది. గత నెల 31 నుంచి ఇది అమలవుతోంది. మూడో విడత లాక్డౌన్ గడువు ముగుస్తుండటంతో తదుపరి కార్యాచరణ కోసం మంత్రి మండలి మరోసారి సమావేశమవుతోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలతో దుకాణాలు, వ్యాపార సముదాయాలు మధ్యాహ్నం ఒంటి గంట వరకు నడుస్తున్నాయి. వ్యాపారాలు సాగుతున్నాయి. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఆంక్షలను మరింత సడలింపు ఇస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. సడలింపు వేళలను ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇవ్వగా, 5 గంటల నుంచి 6 గంటల వరకు గంటపాటు తిరిగి ఎవరి గమ్యస్థానాలకు వారు చేరుకునేందుకు వెసులు బాటు కల్పించాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఇక సాయంత్రం 6 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్ డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో కరోనా పూర్తిగా అదుపులోకి రాని సత్తుపల్లి, మధిర, నల్లగొండ, నాగార్జున సాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాల గూడ, నియోజక వర్గాల పరిధిలో మాత్రం లాక్ డౌన్ ఇప్పుడు కొనసాగుతున్న విధంగానే లాక్డౌన్ కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది.
Also Read: