Rice Millers Cheating: తెలంగాణలో రైతులను దోచుకుంటున్న దళారులు.. సిండికేట్‌గా ఏర్పడి తక్కువ ధరకే ధాన్యం కొనుగోళ్లు

|

Apr 13, 2022 | 1:48 PM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వరివార్‌..ఢిల్లీ నుంచి గల్లీవరకు ఆందోళనలు.. ఇదే సమయంలో ధాన్యాన్ని తామే కొనుగోలు చేయాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో మళ్లీ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. అయితే..

Rice Millers Cheating: తెలంగాణలో రైతులను దోచుకుంటున్న దళారులు.. సిండికేట్‌గా ఏర్పడి తక్కువ ధరకే ధాన్యం కొనుగోళ్లు
Rice Millers Cheating Telan
Follow us on

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వరివార్‌..ఢిల్లీ నుంచి గల్లీవరకు ఆందోళనలు.. ఇదే సమయంలో ధాన్యాన్ని తామే కొనుగోలు చేయాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో మళ్లీ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. అయితే ఇన్నాళ్లూ ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వాల మధ్య గొడవతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయకపోవడంతో ఇదే అదునుగా మిల్లర్లు సిండికేట్‌గా ఏర్పడి అన్నదాతలను దోచుకున్నారు. మార్కెట్‌ కంటే తక్కువ ధరకే ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ రైతులను మోసం చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో యాసంగి సీజన్‌లో దాదాపు 10లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. 23 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వచ్చింది. ఐతే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయకపోవడంతో..దిక్కుతోచని పరిస్థితుల్లో మిల్లర్స్‌ను ఆశ్రయిస్తున్నారు రైతులు. సందట్లో సడేమియాలా మిల్లర్లంతా సిండికేట్‌గా మారి క్వింటాకు 3వందల నుంచి 4వందల రూపాయల వరకు ధర తగ్గించి కొనుగోలు చేస్తున్నారు.

అయితే.. మరో వారంలో పెద్దమొత్తంలో ధాన్యం వచ్చే అవకాశం ఉంది. కానీ ఎగుమతులు లేవనే సాకుతో ధర తగ్గించి కొనుగోళ్లు జరుపుతున్నారని..దీంతో తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. ముందుగానే ధర ఎక్కువ చెల్లిస్తే సీజన్‌ మొత్తం అదే ధర కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో తక్కువ రేటుకు కొనుగోలు చేస్తున్నారు. మిల్లర్లంతా కుమ్మక్కై సన్నరకం ధాన్యం ధరను అమాంతం తగ్గించారని రైతులు వాపోతున్నారు. ఈ ధరకు పంటను అమ్ముకుంటే పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని కన్నీటి పర్యంతమవుతున్నారు. మిల్లర్లు తమను దోచుకుంటున్నా..అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సన్నరకం సాగుచేసిన రైతులే కష్టాలు పడుతుండగా..ఇక దొడ్డురకం కొనుగోళ్లు మరింత కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో దొడ్డురకం సాగు చేసిన రైతులు ఇప్పుడు ఇబ్బందుల్లో పడ్డారు. దొడ్డు రకం ధాన్యాన్ని అటు మిల్లర్లు, ఇటు ప్రభుత్వ రంగ సంస్థలు కొనుగోలు చేస్తాయా లేదా అనే సందిగ్ధంలో పడ్డారు.

ఇవి కూడా చదవండి: Pranahita Pushkaralu: ఇవాళ్టి నుంచి ప్రాణహిత నది పుష్కరాలు.. మధ్యాహ్నం తర్వాత నదిలోకి పుష్కర పురుషుడు..

Tree City: భాగ్యనగరానికి మరో అరుదైన గుర్తింపు.. రెండోసారి ట్రీ సిటీగా..