Medak Congress: పటాన్చెరు కాంగ్రెస్లో పంచాయతీ.. ఇంచార్జ్ మంత్రి ముందే బయటపడ్డ విభేదాలు
మరోసారి పటాన్చెరు కాంగ్రెస్లో వర్గ పోరు భగ్గుమంది. గత కొద్దిరోజులుగా నివురు గప్పిన నిప్పులా ఉన్న ఇద్దరి నేతల మధ్య ఉన్న వైరం ఒక్కసారిగా బయటపడింది..అది ఎక్కడో కాదు జిల్లా ఇంచార్జ్ మంత్రిగా ఉన్న కొండ సురేఖ ముందే కావడంతో పార్టీ హైకమాండ్ కూడా కొంత టెన్షన్కు గురైందట.
కాట శ్రీనివాస్ గౌడ్, నీలం మధు మధ్య అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచే పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రేంజ్లో వైరం నడుస్తోంది. సరిగ్గా ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన నీలం మధుకి మొదట పార్టీ టికెట్ అనౌన్స్ చేసింది. అయితే కాట శ్రీనివాస్ అనుచరులు గాంధీభవన్కి వచ్చి మరీ రచ్చ చేయడంతో తిరిగి కాటా శ్రీనివాస్ గౌడ్ను అభ్యర్థిగా ప్రకటించింది కాంగ్రెస్. దీంతో కాంగ్రెస్ కండువా పక్కనపడేసి బీఎస్పీ కండువా కప్పుకున్న నీలం మధు.. ఎన్నికల బరిలో నిలిచారు. సీన్ కట్ చేస్తే నీలం మధుకి 46వేల ఓట్లు వచ్చాయి. 7 వేల ఓట్లతో కాటా శ్రీనివాస్ ఓడిపోయారు. నీలం మధు వల్లే ఓడిపోయామని కాట శ్రీనివాస్ వర్గం భావిస్తోంది. అందుకే నీలం మధు పేరు చెప్తేనే కాట శ్రీనివాస్ వర్గం రగిలిపోతోంది.
ఈ నేపథ్యంలోనే మరోసారి పటాన్చెరు కాంగ్రెస్లో వర్గ పోరు భగ్గుమంది. గత కొద్దిరోజులుగా నివురు గప్పిన నిప్పులా ఉన్న ఇద్దరి నేతల మధ్య ఉన్న వైరం ఒక్కసారిగా బయటపడింది..అది ఎక్కడో కాదు జిల్లా ఇంచార్జ్ మంత్రిగా ఉన్న కొండ సురేఖ ముందే కావడంతో పార్టీ హైకమాండ్ కూడా కొంత టెన్షన్కు గురైందట. మెదక్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని కాంగ్రెస్ పార్టీలో కొంత అలజడి వాతావరణం కన్పిస్తోంది. ఈ పార్లమెంట్ స్థానం పరిధిలో ఎంపీ అభ్యర్థిని ప్రకటించడానికి చాలా సమయం తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. చివరికి బీసీ సామాజిక వర్గానికి చెందిన నీలం మధును మెదక్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. కానీ అతనికి ఎంపీ సీట్ ఇవ్వడం పట్ల పటాన్చెరు నియోజకవర్గ ఇంచార్జ్గా ఉన్న కాట శ్రీనివాస్ గౌడ్ కొంత అసహనంతో ఉన్నాడట.
గత ఎమ్మెల్యే ఎన్నికల్లోనే కాట శ్రీనివాస్ గౌడ్, నీలం మధుకి మధ్య గ్యాప్ ఏర్పడింది..దీనితో నీలం మధుకి బీసీ సామాజిక వర్గాన్ని చెందిన కొంతమంది సొంత పార్టీ నేతలే సహాయ నిరాకరణ చేస్తున్నారు. పటాన్చెరు నియోజకవర్గ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్, ప్రస్తుత ఎంపీ అభ్యర్థి నీలం మధు మధ్య ఉన్న గ్యాబ్ అలానే కొనసాగుతుంది. దీన్ని గమనించిన కాంగ్రెస్ హై కమాండ్ వీళ్ల ఇద్దరి మధ్య రాజీ కుదుర్చే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జ్ మంత్రిగా ఉన్న కొండ సురేఖ మెదక్ లోక్సభ ఎన్నికల ప్రచార సన్నాహక సమావేశానికి హాజరయ్యారు. ఈ ఇద్దరి నేతల మధ్య ఉన్న గ్యాప్ ను తొలగించడానికి ఎంపీ అభ్యర్థి నీలం మధును వెంట బెట్టుకుని కాట శ్రీనివాస్ గౌడ్ ఇంటికి వెళ్ళారు మంత్రి.
అక్కడే వీరిద్దరి మధ్య రాజీ కుదుర్చే ప్రయత్నం చేశారు మంత్రి కొండ సురేఖ.. కానీ కాట శ్రీనివాస్ గౌడ్ భార్య కాట సుధారాణి మాత్రం మంత్రి సురేఖ ముందే నీలం మధుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నీలం మధు తన భర్తపై ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేశాడని, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడని నీలంపై ఒక రేంజ్ లో సీరియస్ అయ్యారు కాట సుధా. ఇంతలో నీలం మధు ఎదో వివరణ ఇచ్చే ప్రయత్నం చేయబోగా.. ఏమి మాట్లాడవద్దు అంటూ సీరియస్గా అతనికి చేయి చూపించారు కాట సుధా. మంత్రి సురేఖ ఏదో చెప్పే ప్రయత్నం చేయగా.. “మేడమ్ మీ ముందు నేను ఓపెన్ గా చెబుతున్నాను నీలం మధును చెంప పగలకొట్టాలని ఉంది” అని, కాట సుధ మంత్రి సురేఖకు చెప్పడంతో అక్కడ ఉన్న కాట శ్రీనివాస్ వర్గం నీలం మధుకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంతలో మంత్రి కొండా సురేఖ జోక్యం చేసుకుని కాట సుధాకు నచ్చజెప్పారు.
కాగా కాట శ్రీనివాస్ గౌడ్, నీలం మధు ఇద్దరు పటాన్ చెరు నియోజక వర్గనికి చెందిన లీడర్లే. అయినా కూడా ఇద్దరి మధ్య బాండింగ్ అంత పెద్దగా లేదన్నదీ స్థానిక కార్యకర్తల మాట. ఎమ్మెల్యే ఎన్నికల నుండి వీరిద్దరి మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. గతంలో బీఆర్ఎస్ లో ఉన్న నీలం మధు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ తరపున టికెట్ ఆశించడం, అక్కడ టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. అప్పటి వరకు పటాన్ చెరు ఎమ్మెల్యే టికెట్ కాట శ్రీనివాస్ గౌడ్ కే అని అందరు అనుకుంటున్నా వేళ, నీలం మధు కాంగ్రెస్ లో చేరడంతో ఎమ్మెల్యే టికెట్ సైతం అతనికే ప్రకటించారు కాంగ్రెస్ పార్టీ పెద్దలు. దీంతో గాంధీ భవన్ వద్ద రెండు, మూడు రోజులు పెద్ద ఎత్తున్న కాట శ్రీనివాస్ గౌడ్ వర్గం నిరసనలు చేయడంతో ఎమ్మెల్యే టికెట్ను మళ్ళీ కాట శ్రీనివాస్ గౌడ్ కి ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ.
దీంతో వెంటనే కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వెళ్లి బీఎస్పీ పార్టీ నుండి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుని పోటీ చేశాడు నీలం మధు. అప్పటి నుండే వీరి ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో మనస్పర్థలు మొదలు అయ్యాయి. ఎమ్మెల్యే ఎన్నికల నామినేషన్ అప్పుడు కూడా ఇరు వర్గాల కార్యకర్తలు పెద్ద ఎత్తున్న గొడవలకు దిగారు. ఇలా అప్పటి నుండి వీరిద్దరు ఉప్పు, నిప్పులా మారిపోయారు. మరోవైపు ఎమ్మెల్యే ఎన్నికల్లో పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాట శ్రీనివాస్ గౌడ్ ఓటమికి నీలం మధునే కారణము అని ఇప్పటికే కాట శ్రీనివాస్ వర్గం ఆరోపిస్తుంది.
అసెంబ్లీ ఎన్నికల్లో 7,428 ఓట్ల మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి చేతిలో శ్రీనివాస్ గౌడ్ ఓటమి చవిచూశారు. మహిపాల్ రెడ్డికి 1,05,166 ఓట్లు పోలవ్వగా.. కాంగ్రెస్ అభ్యర్ధి కాట శ్రీనివాస్ గౌడ్కు 97,738 ఓట్లు వచ్చాయి. ఇక బీఎస్పీ పార్టీ నుండి పోటీ చేసిన నీలం మధుకి 46,059 ఓట్లు వచ్చాయి. సో నీలం మధు పోటీలో ఉండి ఓట్లు చీల్చాడని, ఆయన పోటీలో లేకుంటే పటాన్ చెరులో కాంగ్రెస్ అభ్యర్థి కాట శ్రీనివాస్ గౌడ్ గెలుపు నల్లేరు మీద నడకల ఉండేది అని కాట వర్గం భావిస్తోందట. ఇలా ఎమ్మెల్యే ఎన్నికల్లో నీలం మధు, కాట శ్రీనివాస్ గౌడ్ మధ్య వచ్చిన గ్యాప్ ఇప్పటికి అలానే కంటిన్యూ అవుతదట.. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ ఇద్దరు నేతలు కలిసిందే లేదు.
ఎంపీ అభ్యర్థిగా నీలం పేరు ప్రకటించగానే మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్న చాలా మంది నేతలను కలిసాడట నీలం. కానీ మొన్నటి వరకు కాట శ్రీనివాస్ గౌడ్ ను మాత్రం కలవలేదు. కాట శ్రీనివాస్ కూడా మొన్నటి వరకు నీలం మధును కలిసే ప్రయత్నం చేయలేదు. ఎమ్మెల్యే ఎన్నికల నేపథ్యంలో వీరిద్దరి మధ్య జరిగిన గోడవలను కాట శ్రీనివాస్ గౌడ్ అంత ఈజీగా మరిచిపోవడం లేదట. ఎమ్మెల్యే టికెట్ విషయంలో, ఎన్నికల్లో తాను ఫేస్ చేసిన ఇబ్బందులను అంత ఈజీగా మరిచి, ఎంపీ ఎన్నికల్లో నీలం మధుకి సపోర్ట్ చేయడానికి కాట శ్రీనివాస్ గౌడ్ ఇష్టపడడం లేదని కాట అనుచరులు చెబుతున్నారు.
కాట శ్రీనివాస్ కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన గౌడ కులానికి చెందిన నేత. ఇతనికి కూడా మంచి ఫాలోయింగ్ ఉంది..కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కాట శ్రీనివాస్ గౌడ్ కానీ, అతని సామాజిక వర్గం కానీ నీలం మధుకి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా లేరని, ఇలా అయితే ఇక్కడ మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో గెలవడం కష్టం అని భావించిన అధిష్టానం కొండ సురేఖను రంగంలోకి దింపింది. కానీ ఆమె ముందే కాట శ్రీనివాస్ గౌడ్ భార్య కాట సుధ, నీలం మధు పై కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఇదిలావుంటే, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మెదక్ ఎంపీ స్థానంను ఎలాగైనా గెలవాలని చూస్తుంది..కానీ ఇక్కడ మాత్రము పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఈ ఇద్దరు నేతలు ఇలాగే దూరంగా ఉంటే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తప్పవని వీళ్ళ ఇద్దరిని కలిపే ప్రయత్నాలు చేశారు కాంగ్రెస్ అధిష్టానం. చివరికి మెదక్ పార్లమెంటు సన్నాహక సమావేశంలో ఇద్దరిని పక్క పక్కకు కూర్చున్నారు. కానీ ఎన్నికల్లో కలిసి పనిచేస్తారా లేదా అనేది ఇప్పుడు అందరికి అనుమానం ఉందట..!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…