Medaram Jathara: మేడారం జాతరకు పోటెత్తిన భక్తజనం.. వారందరికీ 4 రోజులు సెలవులు

|

Feb 21, 2024 | 10:02 PM

రెండేళ్లకోసారి జరిగే జనజాతరకు భక్తజనం పోటెత్తుతోంది. కోర్కెలు తీర్చే తల్లుల దర్శనానికి తండోపతండాలుగా మేడారానికి కదిలారు భక్తులు. మహాజాతరలో తొలిఘట్టమైన వనదేవతలు గద్దెలపైకి చేరే ఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు తరలివచ్చిన జనంతో కీకారణ్యం జనారణ్యమైంది.

Medaram Jathara: మేడారం జాతరకు పోటెత్తిన భక్తజనం.. వారందరికీ 4 రోజులు సెలవులు
Medaram Jatara
Follow us on

శివసత్తుల పూనకాలు, పొర్లు దండాలు, బెల్లం ఘుమఘుమలు, బంగారం మొక్కులు..! గిరిజన సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే వనదేవతల పండగ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోలాహలంగా సాగుతోంది. వనంలో ఉన్న దేవతలు.. జనం మధ్యకు రావడంతో జాతరకు పూనకం పుట్టింది. జంపన్నవాగు జనసంద్రమైంది. కీకారణ్యం.. జనారణ్యమై కోలాహలంగా మారింది. భావోద్వేగం కట్టలు తెంచుకుంది. సల్లంగా సూడు తల్లీ అంటూ శరణు ఘోషలతో దిక్కులు పిక్కటిల్లుతున్నాయి.

డప్పు వాద్యాలు, సంప్రదాయ నృత్యాల మధ్య సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపైకి చేరుకున్నారు. ఇలవేల్పులైన తల్లులకు భక్తులు జంపన్న వాగులో పవిత్ర స్నానాలాచరించి నిలువెత్తు బంగారం, పసుపు, కుంకుమ సమర్పిస్తున్నారు. శివసత్తులు, ఓడిబియ్యం, చీరే సారెలతో తల్లుల ముందు ప్రణమిల్లుతున్నారు. ఇక వరాల తల్లి సమ్మక గురువారం మేడారం గద్దెలపైకి రానున్నది. ఇద్దరు వన దేవతలు గద్దెలపై ఉండే శుక్రవారం మేడారం మొత్తం భక్తులతో కిటకిటలాడుతుంది. శనివారం వన దేవతలు గద్దెలపై నుంచి వనంలోకి వెళ్లడంతో జాతర ముగుస్తుంది. మేడారం జాతర నేపథ్యంలో ములుగు జిల్లాలో ఉన్నటువంటి స్కూల్స్, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. నాలుగు రోజులపాటు సెలవులు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాలు జారీ చేశారు. సండే కూడా సెలవు కావడంతో వరుసగా 5 రోజులు సెలవులు వచ్చాయి.

మేడారం జాతర కోసం దేవాదాయ, పోలీసు, రెవెన్యూ, పంచాయతీ రాజ్‌ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నారు. భక్తులకు పార్కింగ్‌ తదితర చిన్న, చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ, తాగునీరు, వసతి, పారిశుద్ధ్య సౌకర్యాలు కల్పించినట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు జాతరకు వచ్చేందుకు ప్రత్యేక బస్సులతో పాటు పర్యాటక శాఖ హెలికాప్టర్ల సేవలు అందుబాటులోకి తెచ్చింది. ఇక మేడారం జాతర నిర్వహణకు కేంద్రం 3.14 కోట్ల నిధుల కేటాయించింది. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి రూ.2.30 కోట్లు, కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ నుంచి రూ. 0.84 కోట్ల నిధులు విడుదల చేసింది.

మేడారం మహాజాతరకు ముందే లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. దూరప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసలు లెక్కచేయక తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ నాలుగు రోజుల్లో కోటిపైన భక్తులు దర్శించు కోనున్నారు. అమ్మల రాక చీకటిని చీల్చుకుంటూ వెలుగులు విరజిమ్ముతుంది. రెండేళ్లకు ఒకసారి వచ్చే ఈ జాతరలో ప్రతి ఘట్టం.. గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడుతుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…