Musi River: ఇళ్లతోపాటు జీవనోపాధి.. మూసీ నిర్వాసితుల కోసం రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..

|

Oct 06, 2024 | 6:37 AM

మూసీ బ్యూటిఫికేషన్‌పై అస్సలు తగ్గేదే లే అంటుంది కాంగ్రెస్‌. మూసీ నిర్వాసితుల ఇళ్లు కూల్చివేస్తే మేమూ తగ్గమంటున్నాయి విపక్షాలు. ఇలా మిషన్‌ మూసీ కేంద్రంగా రాజకీయం వేడెక్కిన నేపథ్యంలో విపక్షాల స్పీడ్‌కి బ్రేకేసే కీలక నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్‌. నిర్వాసితులకు ఇళ్లతోపాటు జీవనోపాధి కల్పించాలని ఏకంగా కమిటీ ఏర్పాటు చేసింది. మరి మూసీ ప్రక్షాళనలో ఎవరి వ్యూహం ఫలించబోతోంది..?

Musi River: ఇళ్లతోపాటు జీవనోపాధి.. మూసీ నిర్వాసితుల కోసం రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..
CM Revanth Reddy
Follow us on

మూసీ ప్రక్షాళన ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ఆ దిశగా వేగంగా అడుగు ముందుకేసింది. అయితే, మూసీ పరివాహక బాధితుల నుండి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఎన్నో ఏళ్లుగా తమకు నీడనిచ్చిన గూడును కూల్చేస్తుంటే.. భావోద్వేగానికి లోనవుతున్నారు నిర్వాసితులు. ఈ క్రమంలోనే మూసీ పరివాహక ప్రాంత నిర్వాసితులకు ఇళ్లతోపాటు జీవనోపాధి కల్పించాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. మూసీ నది నిర్వాసితుల జీవనోపాధి కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. సెర్ఫ్ సీఈవో ఛైర్మన్‎గా 14 మంది సభ్యులతో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక కమిటీ మూసీ బాధితులకు ఏ విధంగా ఉపాధి కల్పించవచ్చదానిపై చర్చించి ప్రభుత్వానికి నివేదిక అందించనుంది.

బ్యూటిఫికేషన్ కాదు.. లూటిఫికేషన్ అంటూ విమర్శ

అయితే, మూసీ సుందరీకరణకయ్యే బడ్జెట్‌పై అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. అది బ్యూటిఫికేషన్ కాదు.. లూటిఫికేషన్ అంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు మాజీ మంత్రి కేటీఆర్‌. రేవంత్‌కు కోపం ఉంటే తమ ఇళ్లు కూల్చాలని.. పేదల ఇళ్ల జోలికి వెళ్తే మాత్రం ఊరుకోమన్నారు.

ఏ విధంగా ఆదుకోవాలో సలహా ఇవ్వాలన్న రేవంత్‌

బీఆర్‌ఎస్‌ స్పీడ్‌కి బ్రేకేసే ప్రయత్నాల్లో ఉంది కాంగ్రెస్‌. ఇందుకోసం బీఆర్‌ఎస్‌ హయాంలోనే మూసీ ఆక్రమణలు తొలగించేందుకు సిద్ధమైన విషయాన్ని జనంలో చర్చకు పెడుతోంది కాంగ్రెస్‌. మరోవైపు విపక్షాల విమర్శలకు తన రియాక్ట్‌ అయ్యారు సీఎం రేవంత్‌ రెడ్డి. మూసీ నిర్వాసితులను ఏ విధంగా ఆదుకోవాలో విపక్షాలు సలహా ఇవ్వాలని సూచించారు. ముఖ్యనేతలను పిలిచి భట్టి విక్రమార్క, పొన్న ప్రభాకర్‌ చర్చలు జరపాలని కోరారు. కేటీఆర్, హరీష్‌రావు, ఈటల సచివాలయానికి వస్తే.. సూచనలు స్వీకరిస్తామన్నారు.

చర్చలకు రావాలన్న రేవంత్‌ ప్రతిపాదనకు విపక్షాలు సహకరిస్తాయా?

ఇలా మూసీ సాక్షిగా తెలంగాణలో ప్రధాన రాజకీయపక్షాల మధ్య బిగ్‌ఫైట్‌ రోజుకో మలుపు తిరుగుతోంది. ఒప్పించైనా సరే మూసీ సుందరీకరణ చేయాలన్నది ప్రభుత్వం వ్యూహం. ఎందాకైనా సరే పొయి కూల్చివేతలను ఆపాలన్నది విపక్షాల వ్యూహం. మరి ఇలాంటి టైమ్‌లో చర్చలకు రావాలన్న రేవంత్‌ ప్రతిపాదనకు విపక్షాలు సహకరిస్తాయా? కేటీఆర్, హరీష్, ఈటల.. సరే అంటారా, సారీ అంటారా? ఇదే ఇప్పుడు తెలంగాణలో హాట్‌ టాపిక్‌గా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..