భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీకి మరో షాక్ తగిలింది.. తాజాగా మరో ఎమ్మెల్యే గులాబీ పార్టీకి గుడ్బై చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కారు దిగి చెయ్యి అందుకున్నారు. సోమవారం పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గూడెం మహిపాల్ రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం వెంట పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జగ్గారెడ్డి, దామోదర రాజనర్సింహా ఉన్నారు. ఎమ్మెల్యే మహిపాల్రెడ్డితో పాటు గాలిఅనిల్ కాంగ్రెస్లో చేరారు.. ఆయనతోపాటు పలువురు కార్పొరేటర్లు, అనుచరులు కాంగ్రెస్లో చేరారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ గూటికి చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 10కి చేరింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు.. ఇప్పటికే.. గ్రేటర్ పరిధిలో దానం నాగేందర్, ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీ కాంగ్రెస్ లో చేరగా.. తాజాగా మహిపాల్ రెడ్డి రావడంతో ఈ సంఖ్య నాలుగుకి చేరింది. అయితే.. త్వరలోనే కాంగ్రెస్లో మరికొందరు కూడా వస్తారని కాంగ్రెస్ నేతలు ప్రకటనలు చేస్తుండటం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది..
వాస్తవానికి గూడెం మహిపాల్రెడ్డి శనివారమే.. కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం జరిగింది.. ఆరోజున పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి దగ్గరకు వచ్చారు.. చర్చల అనంతరం ఆయన పార్టీలో చేరకుండా తిరిగి వెళ్లారు. తాజాగా.. గూడెం మహిపాల్రెడ్డి కాంగ్రెస్ లో చేరడం చర్చనీయాంశంగా మారింది. గూడెం చేరికతో హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ బలం మరింత పెరిగినట్లయింది..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..