Half Day schools in Telangana : 2020-21 విద్యా సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రంలో హాఫ్ డే తరగతుల అమలుపై రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. కొంచెంసేపటి క్రితం విద్యాశాఖ ఉన్నతాధికారుల సమావేశంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ మేరకు చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ మేనేజ్మెంట్ పాఠశాలల్లో రేపటి (2021 ఏప్రిల్ 7) నుండి ఒంటిపూట బడులు అమల్లో ఉంటాయి. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా పాఠశాలలకు టీచర్లు హాజరు కావాల్సిఉంటుంది. తెలంగాణ పాఠశాల విద్య, హైదరాబాద్, వరంగల్ యొక్క రీజినల్ జాయింట్ డైరెక్టర్లు రాష్ట్రంలోని అన్ని జిల్లా విద్యాశాఖాధికారులకు ఈ మేరకు మంత్రి ఆదేశాలిచ్చారు.
ఇలాఉండగా, ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 1వ తరగతి నుంచి 10 తరగతి విద్యార్థులకు ఒక్కపూటే తరగతులు నిర్వహించాలని రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ కుమార్ ఏప్రిల్ 1న ఆదేశాలిచ్చారు. ఉదయం 7.45 నుంచి 11.30 వరకు తరగతులు.. తరువాత మధ్యాహ్న భోజనం కల్పిస్తున్నారు. పాఠశాల నుంచి విద్యార్థులు క్షేమంగా ఇళ్లకు చేర్చటంపై ఉపాధ్యాయులు శ్రద్ద తీసుకోవాలని కూడా మంత్రి తెలిపారు. ఎండలకు తోడు ఒకపక్క కరోనా కేసులు కూడా పెరుగుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కారు.
పాఠశాలల్లో కోవిడ్ నిబంధనలు అమలుపై కూడా అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. విద్యార్థులకు కోవిడ్ పరీక్షల నిర్వహణతో పాటు, మాస్క్ లు ధరించడం, శానిటైజర్ వినియోగం, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సురేష్ తన ఆదేశాల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా, ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఇవ్వనుండగా.. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయి.