Rain Telangana: ఎడతెరపి లేకుండా కురుస్తోన్న భారీ వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలు వణికిపోతున్న విషయం తెలిసిందే. గడిచిన రెండు రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు జన జీవితం అస్తవ్యస్తమైంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు అలాగే ఎగువ మహారాష్ట్ర నుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో తెలంగాణలోని గోదావరి పరివాహన ప్రాంతాల్లోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో పలు చోట్లు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే అధికారులు బయటకు రావొద్దంటూ ప్రజలకు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయితే కొందరు మాత్రం ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. గురువారం సాయంత్రం ముగ్గురు యువకులు ఇలాగే వరద నీటిలో చిక్కుకున్నారు.
మంచిర్యాల మండలం కొమటిచేను సల్పలా వాగు ప్రాజెక్ట్ ముత్తడి వద్ద గురువారం మధ్యాహ్నం సమయంలో గురువాపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్, శ్రావణ్, ప్రసాద్ అనే ముగ్గురు యువకులు వాగులో చిక్కుకున్నారు. చేపలు పట్టేందుకు వెళ్లిన వీరు.. వరద ఉధృతి ఒక్కసారిగా ఎక్కువ కావడంతో నీటి మధ్యలోనే ఉండిపోయారు. చిన్న గట్టును ఆధారంగా చేసుకొని నిలబడ్డారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు గంటలపాటు నిరీక్షించారు. దీంతో రంగంలోకి దిగిన డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి రెస్కూ ఆపరేషన్ను నిర్వహించారు. గజ ఈత గాళ్ల సహాయంతో యువకులను క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. దీంతో బతుకు జీవుడా అంటూ బయటపడ్డ ఆ యువకులు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. ఇదిలా ఉంటే మరో రెండు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
Also Read: KTR Gift A Smile : గిఫ్ట్ ఎ స్మైల్ : బర్త్ డే సమయాన అద్భుతమైన ప్రకటన చేసిన కేటీఆర్
Telangana Corona: తెలంగాణలో కొత్తగా 648 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు మరణాల సంఖ్య ఇలా