టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఇవాళ ప్రగతిభవన్లో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రులతోపాటు టీఆర్ఎస్ పార్టీకి చెందిన 33 జిల్లాల అధ్యక్షులనూ ఈ సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానం పంపారు. సీఎం కేసీఆర్ ఇవాళ ఉదయం గాంధీ ఆస్పత్రి ఎదుట గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని తిరిగి ప్రగతిభవన్కు చేరుకుంటారు. మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేస్తారు. ఆ తర్వాత సమావేశం ప్రారంభం కానుంది. కొత్తగా పెట్టబోతున్న జాతీయ పార్టీపైనే ప్రధానంగా చర్చ జరుగుతుందని తెలుస్తుంది. దసరా రోజున చేయబోయే ప్రకటనపై పార్టీ నేతలతో చర్చించనున్నట్లు సమచారం. జాతీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించిన అంశాన్ని పార్టీలోని కీలక నేతలకు తొలిసారి చెప్పేందుకు సీఎం కేసీఆర్ సన్నద్ధమవుతున్నారు. విజయ దశమి నాడు జాతీయ పార్టీని అధికారికంగా ప్రకటించేందుకు సీఎం కేసీఆర్ సిద్దమవుతున్నారు. అందులో భాగంగా, దసర రోజున పార్టీ కార్యవర్గ సమావేశం- పార్టీ శాసనసభా పక్ష సమావేశాలు జరగనున్నాయి.
అయితే ఈ సమావేశంలో జాతీయ పార్టీకి అనుకూలంగా తీర్మానం చేయనున్నట్లుగా సమాచారం. జాతీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశాలు, జెండా, అజెండాలపై ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ పార్టీ నేతలకు వివరించనున్నారు. భారత రాష్ట్ర సమితి పేరు ప్రధానంగా వినిపిస్తున్నా.. భారత వికాస సమితి పేరు ఖరారు చేసినట్లుగా టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచరం సాగుతోంది.
తెలంగాణలో ముఖ్యమంత్రిగా కొనసాగుతూనే జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ చెబుతూ వచ్చారు. దీని పైన ఈ రెండు రోజుల్లో స్పష్టత ఇవ్వనున్నారు. తొలిసారి ఈ నిర్ణయాన్ని పార్టీలోని కీలక నేతలందరికీ ఆదివారం జరిగే సమావేశంలో వివరించనున్నారు.అంతే కాదు పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ కీలక సభ్యుల నుంచి సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. అయితే జాతీయ పార్టీ ఏర్పాటు, ప్రకటన కూడా సెంటిమెంట్గా కరీంనగర్ కేంద్రంగా ప్రకటించనున్నట్లుగా తెలుస్తోంది. మొదటి బహిరంగ సభను కూడా కరీంనగర్లోనే ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో ఢిల్లీలో కూడా ఒక బహిరంగ సభను నిర్వహించాలనే ఉద్దేశంతో ఉన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..