Telangana: వరంగల్ లో రేపు బీజేపీ సభ యధాతథం.. హైకోర్టులో కమలం పార్టీకి ఊరట

| Edited By: Phani CH

Aug 27, 2022 | 11:59 AM

జేపీ తెలంగాణ శాఖ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ రేపు వరంగల్ లో యధాతథంగా జరగనుంది. బీజేపీ సభ నిర్వహణకు హన్మకొండ..

Telangana: వరంగల్ లో రేపు బీజేపీ సభ యధాతథం.. హైకోర్టులో కమలం పార్టీకి ఊరట
Bandi Sanjay
Follow us on

Telangana: బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ రేపు వరంగల్ లో యధాతథంగా జరగనుంది. బీజేపీ సభ నిర్వహణకు హన్మకొండ ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటుచేసేందుకు పార్టీ శ్రేణులు అవసరమైన మొత్తాన్ని చెల్లించి.. అనుమతి తీసుకున్నారు. గత రెండురోజులుగా తెలంగాణ పరిస్థితుల కారణంగా.. పోలీసులు సభకు అనుమతి నిరాకరించారు. దీంతో హన్మకొండ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ సైతం బీజేపీ సభకు ఇచ్చిన అనుమతులు రద్దు చేస్తున్నట్లు పార్టీ శ్రేణులకు తెలిపారు. దీంతో ప్రజాసంగ్రామ యాత్ర సభ ఎలాగైనా నిర్వహించాలని పట్టుదలతో ఉన్న బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. పోలీసులు, బీజేపీ తరపు వాదనలు విన్న న్యాయస్థానం సభ జరుపుకునేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో హన్మకొండ ఆర్ట్స్ కళాశాలలో బీజేపీ బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మరం అయ్యాయి. బీజేపీ సభకు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది. విద్యార్థులు పరీక్షలు జరుగుతున్న క్రమంలో పరీక్షల నిర్వహణకు ఇబ్బంది లేకుండా సభ నిర్వహించుకోవాలని సూచించింది. నిర్దేశించిన సమయంలోనే సభను పూర్తి చేయాలని, సభలో ఎక్కడ మతవిద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు ఉండకూడదుని సూచించింది. బీజేపీ సభకు అనుమతి నిరాకరిస్తూ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని, సభ నిర్వహణకు అనుమతులు జారీచేయాలని హైకోర్టు ఆదేశించింది.

శాంతిభద్రతల కారణంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పాదయాత్రను నిలిపివేయాలని వర్థనపేట పోలీసులు నోటీసులు జారీచేయగా.. బీజేపీ ఈనోటీసులను సైతం హైకోర్టులో సవాలు చేయగా.. పాదయాత్ర నిలిపివేయాలని పోలీసులు ఇచ్చిన నోటీసులను సస్పెండ్ చేసింది తెలంగాణ హైకోర్టు. మరోవైపు పాదయాత్ర కొనసాగించుకోవచ్చని తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో సవాలు చేసింది. అయితే దీనిపై విచారణను సోమవారానికి వాయిదా వేశారు. మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర శనివారంతో ముగియనుంది.

మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభకు బీజేపీ జాతీయ అధ్యక్షులు జెపి.నడ్డా హాజరుకానున్నారు. ఈనేపథ్యంలో ఎలాగైనా సభ నిర్వహించి తీరాలని పట్టుదలతో ఉన్న బీజేపీకి హైకోర్టు అనుమతితో ఊరట లభించింది. ఇప్పటికే బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున హన్మకొండ చేరుకుని రేపటి సభ విజయవంతానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు మద్యాహ్నం 12 గంటలకు జేపీ నడ్డా హైదరాబాద్ చేరుకుంటారు. హైదరాబాద్ లో పలువురు ప్రముఖులతో జెపి.నడ్డా సమావేశం అవుతారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా వరంగల్ చేరుకుంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..