Cricket: మారుతున్న కశ్మీరానికి ఈ చిన్నారే నిదర్శనం.. క్రికెట్ షాట్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

| Edited By: Venkata Chari

Apr 02, 2024 | 3:56 PM

ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో క్రీడల్లో బాలికల భాగస్వామ్యం పెరిగింది. కేంద్ర ప్రభుత్వం క్రీడా కార్యకలాపాలపై ప్రత్యేక శ్రద్ధ చూపడం, ముఖ్యంగా బాలికల కోసం కాశ్మీర్‌లో క్రీడలను కొనసాగించడానికి మహిళలను ప్రేరేపించడంలో ప్రత్యేక చొరవ తీసుకుంది. గతంలో కాశ్మీర్‌లోని మహిళలు తమ ప్రయత్నాలు చేసినప్పటికీ, వారి కృషికి తగిన గుర్తింపు పొందేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. అయితే ఈ మధ్యకాలంలో ఈ ప్రాంతానికి చెందిన మహిళలు తమ విజయగాథలను ప్రపంచ పుటల్లో రాస్తున్నారు

Cricket: మారుతున్న కశ్మీరానికి ఈ చిన్నారే నిదర్శనం.. క్రికెట్ షాట్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
Girl Cricketer In Kashimr
Follow us on

Cricket: ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్ లోయలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఇన్నాళ్లుగా తమ చుట్టూ తాము గిరిగీసుకుని కూర్చున్న కాశ్మీర్ ప్రజలు తమ ప్రతిభను బయటి ప్రపంచానికి చాటుతున్నారు. అందుకు తాజా ఉదాహరణ ఉత్తర కాశ్మీర్‌లోని సోపోర్ ప్రాంతానికి చెందిన ఏడేళ్ల చిన్నారి హర్మత్ ఇర్షాద్ భట్. అంత చిన్న వయస్సులో తన అసాధారణ క్రికెట్ నైపుణ్యంతో ఇంటర్నెట్‌లో దూసుకుపోతోంది. ఆ చిన్నారి బ్యాటింగ్ విన్యాసాలు లోయలోని క్రికెట్ ఆటగాళ్లందరినీ అబ్బురపరుస్తున్నాయి. బాల్ పడిందంటే చాలు.. అది బౌండరీ దాటాల్సిందే అన్నట్టుగా మైదానం నలుమూలలకూ బంతిని వీరబాదుడు బాదుతోంది. ప్రొఫెషనల్ క్రికెటర్లకు ఏమాత్రం తీసిపోని విధంగా షాట్లు కొడుతున్న ఆ చిన్నారి ఆటను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు క్యూ కడుతున్నారు. ఆమె ఆటను తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించి తమ సోషల్ మీడియా ఖాతాల్లో పెడుతున్నారు. అలా ఇంటర్నెట్ ప్రపంచంలో వైరల్‌ అవడంతో భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ దృష్టికి ఆకట్టుకుంది. “మగవాళ్లకే పరిమితం అనుకున్న ఆటను అమ్మాయిలు ఆడడం ఎల్లప్పుడూ మంచిదే. ఇలాంటి వీడియోలు చూస్తుంటే నా ముఖంలో చిరునవ్వు వస్తోంది” అంటూ ఆయన ట్విట్టర్ (X)లో పోస్ట్ చేశారు. ఇక అంతే.. ఆ చిన్నారి సంతోషానికి హద్దే లేకుండా పోయింది. ఎలాగైనా సరే భారత మహిళా జట్టులో ఆడాల్సిందేనని హర్మత్ భట్ తన లక్ష్యంగా పెట్టుకుంది. తాను చదువుతున్న పబ్లిక్ స్కూల్‌తో పాటు ప్రభుత్వం, క్రికెట్ ప్రపంచం నుంచి ప్రోత్సాహాన్ని ఆశిస్తోంది.

ఉగ్రవాదం, వేర్పాటువాదంతో సతమతమవుతున్న ప్రాంతంలో పిల్లలు పాఠశాల విద్యకే దూరమై రాళ్లు చేతబట్టి భద్రతాబలగాలపై దాడికి పాల్పడ్డ స్థితి నుంచి తమకు ఆసక్తి ఉన్న రంగంలో ప్రతిభను చాటుకుంటూ ప్రపంచం దృష్టికి ఆకట్టుకునే స్థాయికి కాశ్మీర్‌లో మార్పు కనిపిస్తోంది. క్రికెట్ అంటే ఎందుకు ఆసక్తి ఏర్పడిందో హర్మత్ తన మాటల్లో వివరించింది. “మా తాత నన్ను క్రికెట్ మైదానానికి తీసుకెళ్లేవారు. అలా నేను చాలా కాలంగా మా గ్రామంలోని పిల్లలతో ఆడుకుంటున్నాను. ఇది నా రోజువారీ పనిగా మారిపోయింది. మిథాలీ రాజ్ భారత జట్టు కోసం క్రికెట్ ఆడుతున్న వీడియోలను నేను చూశాను. అవి నన్ను ఎంతో ప్రేరేపించాయి. నేను ఏదో ఒక రోజు టీమ్ ఇండియా కోసం ఆడాలనుకుంటున్నాను. అందుకే క్రికెట్ రోజూ ఆడుతున్నాను” అంటూ ఆ చిన్నారి చెప్పుకొచ్చింది.

హర్మత్ తండ్రి వృత్తి రీత్యా డ్రైవర్. కూతురు హర్మత్ వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో నెటిజన్లందరూ ఆమెను ప్రశంసిస్తున్నారు. ఆమె అసాధారణమైన క్రికెట్ నైపుణ్యాలు మహిళా క్రికెట్ రంగంలో దూసుకెళ్లేలా చేయగలవని, ఈ వయస్సు నుంచే మంచి కోచ్ శిక్షణ అందితే కచ్చితంగా దేశ ప్రతిష్టను, కాశ్మీర్ ప్రతిష్టను నలుదిశలా చాటగలదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. హర్మత్ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. “ఆమె చిన్న వయస్సులో అద్భుతమైన క్రికెట్ ఆడుతోంది, ఆమెకు మద్దతు లభిస్తే భవిష్యత్తులో కాశ్మీర్ మాత్రమే కాకుండా టీమ్ ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తుంది. అలాగే లోయలోని వేలాది మంది అమ్మాయిలకు సహాయం కూడా చేస్తుంది. గ్రామీణ ప్రాంతాలకు, ముఖ్యంగా కాశ్మీర్‌ లోయలోని గ్రామాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. ఈ అమ్మాయి కలలను సాకారం చేయడంలో సహాయం అందితే బావుంటుంది” అంటూ విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి

ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో క్రీడల్లో బాలికల భాగస్వామ్యం పెరిగింది. కేంద్ర ప్రభుత్వం క్రీడా కార్యకలాపాలపై ప్రత్యేక శ్రద్ధ చూపడం, ముఖ్యంగా బాలికల కోసం కాశ్మీర్‌లో క్రీడలను కొనసాగించడానికి మహిళలను ప్రేరేపించడంలో ప్రత్యేక చొరవ తీసుకుంది. గతంలో కాశ్మీర్‌లోని మహిళలు తమ ప్రయత్నాలు చేసినప్పటికీ, వారి కృషికి తగిన గుర్తింపు పొందేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. అయితే ఈ మధ్యకాలంలో ఈ ప్రాంతానికి చెందిన మహిళలు తమ విజయగాథలను ప్రపంచ పుటల్లో రాస్తున్నారు. ఇతరులను కూడా వారి అడుగుజాడల్లో నడిచేలా ప్రేరేపిస్తున్నారు. ఉత్తర కాశ్మీర్‌లోని చాలా మంది యువతులు తమ సక్సెస్ స్టోరీలు ద్వారా వారి తల్లిదండ్రులనే కాదు మొత్తం జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రాన్ని గర్వించేలా చేస్తున్నారు. కొత్త తరం కాశ్మీర్ మహిళలకు వారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మూస పద్ధతులను విచ్ఛిన్నం చేస్తూ మహిళలు ఇకపై పురుషులపై ఆధారపడరని చాటి చెబుతున్నారు. ఉత్తర కాశ్మీర్ 27 ఏళ్ల అంతర్జాతీయ వీల్‌చైర్ బాస్కెట్‌బాల్ క్రీడాకారిణి ఇన్షా, కాశ్మీర్‌కు చెందిన మొదటి మహిళా రెజ్లర్ నహిదా నబీ, మొదటి తరం మహిళా క్రికెటర్లు ఇష్రత్ రసూల్, తజాముల్ ఇస్లాం, స్నోబార్ సమదర్, రౌనక్ రియాజ్.. ఇలా అనేక మంది స్టార్ ప్లేయర్‌లను తయారు చేసింది. వారంతా కాశ్మీర్ లోయకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి, కీర్తి, ప్రతిష్ట సంపాదించి పెడుతున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..