
బ్యాంక్ అకౌంట్లలోని నగదును కాజేయడానికి మోసగాళ్లు కొత్త కొత్త మార్గాల్లో ప్రయత్నిస్తున్నారు. దీంతో బ్యాంకు అకౌంట్, ఏటీఎం కార్డు, ఓటీపీ వివరాలు ఎవ్వరికీ షేర్ చేయకూడదని బ్యాంకులు తరచూ కస్టమర్లను హెచ్చరిస్తున్నాయి. అయినా ఏదో ఒక కొత్త రూపంలో ఆర్థిక మోసాలు జరుగుతూనే ఉన్నాయి.

ఇప్పుడు చాలామంది కేటుగాళ్లు నకిలీ బ్యాంక్ చెక్ ద్వారా క్యాష్ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బ్యాంకులు చెక్(Cheque) కన్ఫర్మేషన్ కోసం సంబంధిత కస్టమర్కు ఫోన్ చేసినప్పుడు అసలు విషయం బయట పడుతోంది. ఈ నేపథ్యంలో నకిలీ చెక్లతో ఎలా మోసాలు జరుగుతున్నాయి, వీటిని అడ్డుకోవడానికి ఆర్బీఐ ఎలాంటి చర్యలు తీసుకుందో ఇప్పుడు చూద్దాం..

ఉదాహరణకు ఓ వ్యక్తికి ఇటీవల బ్యాంక్ నుంచి చెక్ కనఫర్మేషన్ కోసం ఫోన్ వచ్చింది. అకౌంట్ నుంచి రూ.80,000 ఇవ్వడానికి చెక్ వచ్చిందని, కన్ఫర్మ్ చేయాలని ఖాతాదారును బ్యాంక్ సిబ్బంది కోరారు. అసలు విషయం ఏంటంటే.. ఆ కస్టమర్/ఖాతాదారు అసలు ఎలాంటి చెక్ ఇవ్వలేదు. చెక్ను తిరస్కరించమని అతను బ్యాంక్ను కోరారు. మోసగాళ్ళు అతని పేరు మీద జారీ చేసిన ఉపయోగించని చెక్ లీఫ్ నకిలీ కాపీని ఎలా పొందారనేది ఆశ్చర్యంగా ఉన్నా.. ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి.

చెక్లకు సంబంధించిన ఇలాంటి మోసాల సంఖ్య పెరుగుతుండటంతో, పేమెంట్స్ క్లియర్ చేసే ముందు కస్టమర్ల నుంచి చెక్ కనఫర్మేషన్ తీసుకోవాలని బ్యాంకులకు భారతీయ రిజర్వ్ బ్యాంక్(RBI) సూచించింది. కనీస చెక్ మొత్తాన్ని నిర్ణయించడానికి బ్యాంకులకు వెసులుబాటు ఉంది. ఆ మొత్తాన్ని మించిన తర్వాత కస్టమర్ల నుంచి బ్యాంకులు కనఫర్మేషన్ కోరుతాయి.

పేమెంట్స్ కోసం చెక్లను సమర్పించిన సమయంలో కస్టమర్లను బ్యాంక్లు సంప్రదించలేనప్పుడు సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ కారణంతో నిజమైన చెక్ను డిస్హానర్ చేసినా, తిరిగి ఇచ్చేసినా కస్టమర్లు అసౌకర్యానికి గురవుతారు. నిజమైన చెక్కులను హానర్ చేయకపోవడం/వాపసు చేయడం వంటి సమస్యలను ఎదుర్కోవడానికి 2021 జనవరి 1 నుంచి వర్తించే అన్ని చెక్ల పేమెంట్స్కు RBI పాజిటివ్ పే విధానాన్ని ప్రవేశపెట్టింది.

పాజిటివ్ పే ద్వారా.. చెక్ను జారీ చేసిన వెంటనే దాని వివరాల గురించి అతని/ఆమె బ్యాంక్ బ్రాంచ్కు తెలియజేయడానికి కస్టమర్కు అవకాశం ఉంటుంది. దీంతో పేమెంట్ కోసం చెక్ సమర్పించినప్పుడు ఎటువంటి అవాంతరాలు లేకుండా క్లియర్ చేయవచ్చు. ఇన్టిమేషన్ ఆఫ్లైన్లో రాతపూర్వకంగా లేదా నెట్ బ్యాంకింగ్ లేదా బ్యాంకింగ్ యాప్ల ద్వారా ఆన్లైన్లో ఇవ్వవచ్చు.

దీని ప్రకారం ఎవరైనా కస్టమర్ పేమెంట్ కోసం సమర్పించే ముందు చెక్ కనీస వివరాలైన తేదీ, లబ్ధిదారుడు/చెల్లింపుదారుని పేరు, మొత్తం మొదలైన వాటిని బ్యాంకుకు అందించాలి. పేమెంట్ కోసం చెక్ సమర్పించినప్పుడు, బ్యాంక్ వివరాలతో సరిపోలితేనే బ్యాంక్ దానిని అంగీకరిస్తుంది. వివరాలు సరిపోలకపోతే ఆ చెక్ను బ్యాంకులు తిరిగి ఇచ్చేస్తాయి. ఈ విషయాన్ని కస్టమర్కు కూడా తెలియజేస్తాయి.