ఏజెన్సీలోని మారుమూల ప్రాంతంలో అడవి బిడ్డలకు డోలిమోతలు తప్పడం లేదు. గర్భిణులు, రోగులకు అత్యవసరమైనప్పుడు వెళ్లాలంటే రహదారి లేక వాహనాలు రాక తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. తాజాగా అనారోగ్య బారినపడ్డ ఆదివాసి మహిళలకు ఆరు కిలోమీటర్ల మేర డోలిమోసారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం మూలపేట పంచాయితీ జాజులు బంధ. కొండ శిఖర గ్రామంలో 29 కుటుంబాల్లో 140 మంది జనాభా నివాసం ఉంటున్నాయి. ఈ ప్రాంతానికి వెళ్లాలంటే సరైన రహదారి లేదు.
అందుకే ఏదైనా అత్యవసరమైనప్పుడు అంబులెన్సులో రాక తీవ్ర అవస్థలు పడుతుంటారు ఈ అడవి బిడ్డలు. మర్రి కావ్య అనే గిరిజన మహిళ.. గత వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఉంది. తెల్లవారుజామున కడుపులో నొప్పి విపరీతంగా రావడంతో ఆసుపత్రికి తరలించేందుకు సిద్ధమయ్యారు కుటుంబ సభ్యులు.
అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేకపోవడంతో గ్రామస్తుల సహకారం కోరారు. ఇక డోలి కట్టి.. కావ్యను ఆరు కిలోమీటర్లు మోసుకుంటూ తీసుకెళ్లారు. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం ఆర్ల గ్రామం వరకు తీసుకొచ్చారు. అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో.. కావ్య భర్త కామేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
అక్కడ నుంచి మళ్లీ కావ్యను డోలుమోసుకుంటూ బుచ్చింపేట ప్రాథమిక వైద్య కేంద్రంకు తరలించి వైద్యం అందించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ గ్రామానికి రోడ్డు సదుపాయం కల్పించి ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కే గోవిందరావు కోరారు. అసంపూర్తిగా ఉన్న రోడ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.