Tejashwi Yadav: కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై బీహార్ రైతులకు అవగాహన కల్పిస్తామని రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ నేత తేజస్వీ యాదవ్ అన్నారు. అంతేకాకుండా జనవరి 24 నుంచి 30వ తేదీ వరకు కిసాన్ జాగృత్ సప్త కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారానే బీహార్ రైతులకు మూడు సాగు చట్టాలపై అవగాహన కల్పించనున్నామన్నారు. గురువారం ఆయన పాట్నాలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. జనవరి 20న కేంద్ర ప్రభుత్వానికి రైతులకు మధ్య జరిగిన 10వ విడత చర్చల్లో కేంద్ర ప్రతిపాదనలకు రైతు సంఘాల నేతలు సముఖత వ్యక్తం చేశారు. అనంతరం ఒక్క రోజు తర్వాత తేజస్వీ యాదవ్, వ్యవసాయ చట్టాలపై రైతులకు అవగాహన కల్పిస్తామని ప్రకటించడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
అలాగే బడ్జెట్ సమావేశాలను 2 నుంచి 3 రోజులకు కుదించేందుకు నితీష్ కుమార్ ప్రభుత్వం కుట్ర పన్నిందని తేజస్వీ ఆరోపణలు చేశారు. అయితే తాము ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంతో 22 రోజుల వరకు పొడిగించారని అన్నారు.