అండర్‌ వరల్డ్‌కి నయా దావూద్‌.. ఫైనాన్స్ క్యాపిటల్‌ని గడగడలాడిస్తున్న ఈ కిల్లర్‌ ఎవరు?

ముంబై అండర్‌ వరల్డ్‌ మళ్లీ యాక్టీవ్‌ అయింది. గతంలో ముంబై చీకటి సాజ్రమ్యాన్ని లీడ్ చేసిన డీ-కంపెనీ దాదాపు ఫేడవుటైపోవడంతో ఇప్పుడు కొత్త గ్యాంగ్ ఎంటరైంది.

అండర్‌ వరల్డ్‌కి నయా దావూద్‌.. ఫైనాన్స్ క్యాపిటల్‌ని గడగడలాడిస్తున్న ఈ కిల్లర్‌ ఎవరు?
Lawrence Bishnoi
Follow us

|

Updated on: Oct 15, 2024 | 7:24 AM

ముంబై అండర్‌ వరల్డ్‌ మళ్లీ యాక్టీవ్‌ అయింది. గతంలో ముంబై చీకటి సాజ్రమ్యాన్ని లీడ్ చేసిన డీ-కంపెనీ దాదాపు ఫేడవుటైపోవడంతో ఇప్పుడు కొత్త గ్యాంగ్ ఎంటరైంది. అండర్‌ వరల్డ్‌కి నయా దావూద్‌ వచ్చాడు. అతను ఉండేది జైల్లో.. కానీ జరిగే హత్యలు జరిగిపోతుంటాయి. కటకటాల్లో ఉండే ఏడు దేశాల్లో నెట్‌వర్క్‌ మెయింటేన్‌ చేస్తున్నాడు. ఫైనాన్స్ క్యాపిటల్‌ని గడగడలాడిస్తున్న ఈ కిల్లర్‌ ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు..? దావూద్‌ని రీప్లేస్‌ చేయాలనుకుంటున్నాడా..? అతని హిట్‌ లీస్ట్‌లో ఇంకా ఎవరున్నారు..? ఇదే ఇప్పుడు పోలీసులను ముచ్చెమటలు పట్టిస్తోంది.

గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌.. ఉత్తర భారతాన్ని వణికిస్తున్న కొత్త కటౌట్ ఇది. మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్యతో గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. గత కొన్నేళ్లుగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్.. దేశంలో తీవ్ర అశాంతిని నెలకొల్పుతుండటంతో మరోసారి నైటీస్‌లో దేశాన్ని వణికించిన అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గుర్తుకు వస్తున్నాడు. దావూద్ ఇబ్రహీంకు చెందిన డీ-కంపెనీతో ఎన్ఐఏ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ను పోల్చింది. చిన్న చిన్న నేరాలతో నెట్‌వర్క్‌ను విస్తరించిన దావూద్ ఇబ్రహీం లాగే లారెన్స్ బిష్ణోయ్ కూడా ఉగ్రవాద సిండికేట్‌గా పనిచేస్తున్నట్లు ఎన్‌ఐఏ అనుమానం. డ్రగ్స్ అక్రమ రవాణా, టార్గెట్ కిల్లింగ్స్, దోపిడీ రాకెట్ల ద్వారా దావూద్ ఇబ్రహీం తన నెట్‌వర్క్‌ను విస్తరించి.. ఆ తర్వాత పాకిస్థాన్ ఉగ్రవాదులతో కలిసి డీ-కంపెనీని ఏర్పాటు చేశాడు. ఇక అదే రకంగా చిన్న చిన్న నేరాలతో మొదలైన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్.. ప్రస్తుతం ఉత్తర భారతదేశాన్ని శాసిస్తుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

పంజాబ్‌కు చెందిన 31 ఏళ్ల లారెన్స్ ప్రస్తుతం సబర్మతి జైల్లో ఉన్నా, తన గ్యాంగ్‌ను నిరాటంకంగా నిర్వహిస్తున్నాడు. కటకటాల వెనక నుంచే తన ముఠాను ఆపరేట్‌ చేస్తున్నాడు. పొలిటీషియన్లనే కాదు.. బాలీవుడ్‌ను సైతం ఒంటిచేత్తో వణికిస్తున్న నేరగాడు. ఇంటర్మీడియట్ చదివి.. పంజాబ్ యూనివర్సిటీ డీఏవీ కాలేజీలో చేరి.. అక్కడే నేషనల్ రేంజ్ అథ్లెట్‌గా.. స్టూడెంట్ లీడర్‌గా ఎదిగాడు. లా పూర్తి చేశాక గోల్డీ బ్రార్‌ అనే గ్యాంగ్‌స్టర్‌తో పరిచయం పెంచుకుని, సంఘ వ్యతిరేక శక్తిగా మారాడు. గ్యాంగ్‌వార్‌లో భాగంగా అతడి ప్రియురాలు సజీవదహనం కావడంతో.. అక్కడినుంచి ఇంకా హార్డ్‌కోర్ క్రిమినల్‌గా మారాడు. లారెన్స్ శాకాహారి. తినేది వెజ్‌ అయినా.. మనుషుల్ని మాత్రం మటన్‌ కొట్టినట్టు కొట్టి చంపేస్తున్నాడు.

2018లో బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్‌ హత్యకు కుట్ర పన్ని.. జాతీయ స్థాయి వార్తలకెక్కాడు బిష్ణోయ్. ఏడు దేశాల్లో నెట్‌వర్క్‌ నడుపుతున్నాడు. ప్రస్తుతం బిష్ణోయ్ గ్యాంగ్‌లో అనేక ప్రొఫెషనల్ షూటర్లు ఉన్నారు. వీరి నెట్‌వర్క్ పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్‌లలో విస్తరించింది. లారెన్స్‌ను చంపేందుకు ఢిల్లీలోని గ్యాంగ్‌స్టర్లు ఇంకా కాచుకు కూర్చోవడంతో, అతడిని వివిధ కేసుల్లో కోర్టుకు తరలించడం కూడా పోలీసులకు కత్తిమీద సాముగా మారింది.

గతంలో దావూద్‌ను నిర్లక్ష్యం చేసి వదిలివేయడంతో అంతర్జాతీయ ఉగ్రవాదిగా మారాడు. ఇప్పుడు లారెన్స్ బిష్ణోయ్‌ను పట్టుకొని.. జైల్లో పెట్టినా.. బ్యారక్‌ల్లో అక్రమంగా వచ్చే సెల్‌ఫోన్ల ద్వారా అనుచరులతో నిరంతరం టచ్‌లో ఉంటాడని వార్తలు వస్తున్నాయి. అతని గ్యాంగ్‌కు పక్కా స్కెచ్‌తో మెసేజ్‌లు చేరుతున్నాయి. జైల్లో ఉన్నా.. అతను ఓ మాజీ మంత్రిని.. అత్యంత కీలక నేతను హత్య చేయించగలిగాడంటే.. చిన్న విషయం కాదన్న అభిప్రాయం వినిపిస్తోంది. ప్రస్తుతం ముంబైలో ఖాళీగా ఉన్న మాఫియా రాజ్యాన్ని ఆక్రమించడానికి ఇతడు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం..!

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..