Train Journey: మామూలుగా అయితే, ఇది పెళ్ళిళ్ళ సీజన్. ఇంకా ఎండాకాలం సెలవుల సీజన్. ఈ రోజుల్లో ఎక్కడికన్నా ప్రయాణం చేయాలంటే బోలెడు రైళ్ళు ఉన్నపుడే కనీసం మూడు నెలల ముందు టికెట్ రిజర్వ్ చేసుకోవాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. మూడు గంటల ముందు ఇంకా చెప్పాలంటే రైలు బయలుదేరే ముందు కూడా సగం రైలు ఖాళీగానే ఉంటున్న పరిస్థితి వచ్చింది. కరోనా కాలం ప్రజలకు ఎక్కడికీ వెళ్ళే ఆలోచన కూడా రానీయడం లేదు. తప్పనిసరి అవసరాలు ఉన్నవారు తప్ప ఎవరూ ప్రయాణాలు చేయడం లేదు. కరోనా భయంతో ఇంటిపట్టునే ఉంటె మేలని భావిస్తున్నారు. పెళ్ళిళ్ళు చేసుకుంటున్నవారు కూడా ఆన్లైన్ లో మా పెళ్లి చూసేయండి.. లైకులు కామెంట్లతో దీవించండి అంటూ చెబుతున్నారు. దీంతో రైళ్ళు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఒక్క దూరప్రాంతాల నుంచి వలస కార్మికులు ఎక్కువ ఉన్న ప్రాంతాలలో తిరిగే రైళ్ళు తప్ప మిగిలినవి చాలా ఖాళీగా ఉంటున్నాయి.
సాధారణంగా వేసవికాలం వచ్చిందంటే రైళ్లన్నీ కిటకిటలాడుతుంటాయి. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో రెండు నెలల ముందు ప్రయత్నం వేసినా ఓ పట్టాన రిజర్వేషన్ దొరకదు. కొవిడ్ మహమ్మారి విజృంభణతో పరిస్థితి పూర్తిగా మారింది. జనవరి నుంచి రైళ్లన్నీ పూర్తి స్థాయిలో నిండుతున్నా ఏప్రిల్ నాటికి సీట్ల భర్తీకి పరిగణనలోకి తీసుకునే ఆక్యుపెన్సీ రేషియో(ఓఆర్) శాతం భారీగా పడిపోయింది. జనవరిలో 115 శాతం, ఫిబ్రవరిలో 122, మార్చిలో 114 శాతం ఉండగా.. ఏప్రిల్ మొదటి పక్షంలో 79కి పడిపోయింది. రెండో పక్షంలో దాదాపు 65 శాతం ఉంటుందని అంచనా వేస్తున్నారు. భారీగా కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో ముందస్తు రిజర్వేషన్ చేయించుకున్న వారు ప్రయాణాలను మానుకుంటున్నారు.
కాగా, వేసవి కాలంలో దూర ప్రయాణికులు ఏసీ ప్రయానానికే ప్రాధాన్యం ఇచ్చేవారు. కరోనా దెబ్బకు జనం ఏసీ అంటేనే విముఖత చూపిస్తున్నారు. ఏసీ బోగిల్లో గాలి బయటకు వెళ్ళడానికి ఏర్పాట్లు చేసినా ప్రయాణీకులు మాత్రం స్లీపర్ లో ప్రయాణానికే ప్రాధాన్యం ఇస్తుండటం విశేషం.