Israeli embassy blast: ఒకవైపు రైతుల ఆందోళనలతో ఢిల్లీ అట్టుడుకుతుంటే.. మరో వైపు తాజాగా బాంబు పేలుడు ఘటన ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఢిల్లీలోని ఇజ్రాయిల్ రాయబార కార్యాలయానికి సమీపంలో బాంబు పేలుడు జరిగిన నేపథ్యంలో భద్రతా దళాలు అప్రమత్తం అయ్యాయి. ఈ ఘటనలో కొన్ని కార్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి. అయితే ఈ ఘటనలో ఆస్తి, ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నట్లయింది. కేవలం సంచలనం కోసమే అల్లరిమూకలు ఈ ఘటనకు పాల్పడి ఉంటారని ఢిల్లీ పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
ఇజ్రాయిల్ ఎంబసీ వద్ద 2012లో జరిగిన కారు బాంబు దాడిని తాజా ఘటన మరోసారి గుర్తు చేస్తోంది. ఆ దాడికి ఇరాన్ కారణమని అప్పట్లో వచ్చిన వార్తలు చర్చనీయాంశంగా మారాయి. ఇజ్రాయిల్ ఎంబసీకి చెందిన టొయోటా ఇన్నోవా కారుపై బాంబు దాడి జరిగింది. బాంబు అమర్చిన ఓ బైక్ ఢీకొట్టడం వల్లే ఆ పేలుడు జరిగినట్లు అనుమానించారు. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. అదే సమయంలో జార్జియాలోని ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం వాహనం వద్ద ఓ బాంబును పోలీసులు నిర్వీర్యం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అలా ఇజ్రాయిల్ రాయబార అధికారులను టార్గెట్ చేస్తూ ఈ దాడులు జరిగినట్లు వచ్చిన వార్తలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించాయి. ఇది ఇరాన్ పనే అని ఇజ్రాయిల్ ప్రధాన మంత్రి బెంజిమెన్ నేతన్యాహు కూడా ఆరోపణలు చేశారు. 2012లో థాయిలాండ్, అజెర్బైజాన్ దేశాల్లో ని ఇజ్రాయిల్ రాయబార కార్యాలయ అధికారులను లక్ష్యంగా చేసుకుని ఇటువంటి దాడులు జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. ఇది ఇజ్రాయిల్-ఇరాన్ మధ్య జరిగిన మాటల యుద్ధానికి కారణమైంది. అనంతరం పోలీసులు జరిపిన దర్యాప్తుల్లోనూ ఇరాన్ హస్తం ఉన్నట్లు తెలిసింది. అయితే దీనిని ఇరాన్ ఖండించింది. ఉగ్రవాదుల పని అని చెప్పుకొచ్చింది.
Also Read:
High Alert: ఢిల్లీ బాంబు పేలుడు నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న సీఐఎస్ఎఫ్.. దేశవ్యాప్తంగా ఉన్న..
Israeli embassy blast: ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద పేలుడు.. పలు కార్లు ధ్వంసం