భారత్ పునర్నిర్మాణంలో ప్రధాని మోదీ వ్యూహాలు.. విదేశాంగ విధానంలో కీలక విజయాలు

|

Sep 17, 2024 | 9:52 AM

ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ(మంగళవారం) 74వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు రాజకీయ నేతలు, సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉండగా..

భారత్ పునర్నిర్మాణంలో ప్రధాని మోదీ వ్యూహాలు.. విదేశాంగ విధానంలో కీలక విజయాలు
PM Narendra Modi
Follow us on

ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ(మంగళవారం) 74వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు రాజకీయ నేతలు, సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉండగా.. 11 సంవత్సరాల ప్రధాని మోదీ పాలనలో భారతదేశం విదేశాంగ విధానంలో గణనీయంగా మార్పులు తీసుకొచ్చింది. వ్యూహాత్మక ప్రణాళికల ద్వారా అంతర్జాతీయ సంబంధాలను మరింత దృఢంగా మార్చారు ప్రధాని మోదీ. దేశ భద్రత, ప్రపంచస్థాయిలో భారత్‌ను అగ్రస్థానంలో నిలపడమే కాకుండా.. ఆర్ధిక, భద్రతా భాగస్వామ్యాలను ప్రోత్సహించడంలో ప్రధాని మోదీ విదేశాంగ విధానలు ఏమేరకు విజయాలు తెచ్చిపెట్టిందో ఇప్పుడు చూద్దాం..

  • విదేశీ విధానాల్లో మార్పులు..

గత దశాబ్దకాలంగా, ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశప్రజలను విదేశాల నుంచి తిరిగి సొంత రాష్ట్రాలకు సురక్షితంగా తీసుకొచ్చేందుకు పక్కా ప్రణాళికలు రచించింది. విపత్తు ఏదైనా, యుద్ధం ఏ దేశంలో మొదలైనా.. తన దేశప్రజలను ఆయా ప్రాంతాల నుంచి సురక్షితంగా తిరిగి తీసుకొచ్చారు ప్రధాని మోదీ. సిరియా, యెమెన్ వంటి యుద్ధంతో దెబ్బతిన్న దేశాల నుంచి భారతీయ పౌరులను తరలించడం, అలాగే రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంలో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను తరలించడానికి ఆపరేషన్ గంగా ప్రారంభించడం లాంటి వాటిని ప్రధాని మోదీ మొదలుపెట్టారు. అనంతరం విజయం సాధించారు. దేశ పౌరులను భారత్‌కు తిరిగి తీసుకొచ్చారు.

  • కోవిడ్ మహమ్మారి.. 

కోవిడ్ మహమ్మారి సమయంలో అభివృద్ధి చెందిన దేశాలు తమను తాము రక్షించుకోవడానికి ప్రపంచంలోని పేద, చిన్న దేశాలను వదిలేసినప్పుడు, భారత్ పెద్దన్నగా ముందుకొచ్చింది. ‘వ్యాక్సిన్ మైత్రి’ చొరవతో భారత్ 100 దేశాలలో 200 మిలియన్ డోసుల COVID-19 వ్యాక్సిన్‌లను ఎగుమతి చేసింది. ఇందులో దక్షిణాసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, కరేబియన్, ఆగ్నేయాసియా వంటి దేశాలున్నాయి. ఈ చొరవ వివిధ ప్రాంతాలలో వ్యాక్సిన్ కొరతను పరిష్కరించడమే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా భారతదేశం దౌత్య సంబంధాలను బలోపేతం చేసింది.

  • దక్షిణాసియా దేశాలతో బంధం..

దక్షిణాసియాలోని దేశాల మధ్య దౌత్య సంబంధాలకు ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. భారత్, బంగ్లాదేశ్ మధ్య మైలురాయి భూసరిహద్దు ఒప్పందాన్ని ఖరారు చేయడంలో మోదీ సర్కార్ విజయం సాధించింది. దక్షిణాసియా ఉపగ్రహం GSAT-9 ప్రయోగం దక్షిణాసియా ప్రాంతీయ సహకారంలో ఒక మైలురాయిగా నిలిచింది.

  • ఎకనామిక్ డిప్లమసీ అండ్ గ్లోబల్ లీడర్‌షిప్..

భారతదేశ ఆర్థిక ప్రయోజనాలను సంరక్షించుకునేలా ప్రధాని మోదీ సర్కార్ సంక్లిష్టమైన భౌగోళిక రాజకీయ ప్రణాళికలను నేర్పుగా నావిగేట్ చేసిందని చెప్పొచ్చు. అంతర్జాతీయ ఆంక్షలు ఉన్నప్పటికీ భారతదేశం రాయితీపై రష్యా ముడి చమురును కొనుగోలు చేయడం ఇందుకు పెద్ద ఉదహరణ. ఈ చర్య భారత్ దేశీయ ఇంధన అవసరాలను తీర్చడమే కాకుండా.. అస్థిరంగా ఉన్న ప్రపంచ పరిస్థితులను దౌత్యపరమైన సున్నితత్వాలతో ఆర్థిక ప్రాధాన్యతలను సమతుల్యం చేసేలా చేసింది. తద్వారా ఉక్రెయిన్-రష్యా మధ్య నెలకొన్న సంక్షోభాన్ని చర్చల ద్వారా సరి చేసేందుకు భారత్ మధ్యవర్తిగా వ్యవహరించేలా చేసింది. వివాదల పరిష్కారంలో నిర్మాణాత్మక పాత్రను పోషించడానికి ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి. దీంతో ప్రధాని మోదీ నేతృత్వంలోని భారత్ గ్లోబల్ వేదికపై అత్యంత సన్నితం దేశంగా ఆవిర్భవించడానికి దోహదపడింది. 2023లో G20 సమ్మిట్‌ను భారత్ విజయవంతంగా అధ్యక్షత వహించింది. ఆ G20 సమ్మిట్‌లో కీలకమైన ప్రపంచ సమస్యలపై అన్ని దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. G20లో ఆఫ్రికన్ యూనియన్‌ను శాశ్వత సభ్యదేశంగా చేర్చే చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇవన్ని విజయాలు భారత దేశం ప్రపంచ వేదికపై తన స్థానాన్ని పటిష్టం చేసుకునేలా చేశాయి.

  • విదేశాలలోనూ భారత్ కరెన్సీ చెల్లుబాటు..

రష్యా, ఇరాన్‌తో సహా వివిధ దేశాలు రూపాయితో ట్రేడ్ కొనసాగించేందుకు అంగీకరించాయి. దీని వల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవ్వడమే కాదు.. భారతదేశ ఆర్థిక సార్వభౌమత్వాన్ని పెంపొందించడానికి దోహదపడతుంది. ఈ విధానం భారతదేశ ఆర్థిక వ్యవస్థపై భారీగా ప్రభావం చూపింది. కరెన్సీ హెచ్చుతగ్గులు, అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల ఒడిదుడుకులను తగ్గించింది.

  • గ్లోబల్ ఇనిషియేటివ్‌లకు నాయకత్వం వహించడం..

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో భారతదేశం అనేక అంతర్జాతీయ పొత్తులు, కార్యక్రమాలను ప్రారంభించింది. ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడంలో తన నిబద్ధతను, అంతర్జాతీయ సహకారాన్ని సమీకరించే సామర్థ్యాన్ని భారత్ ప్రదర్శిస్తోంది. వీటిలో ముఖ్యమైనవి:

ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్(ISA): 2015లో భారతదేశం, ఫ్రాన్స్ సంయుక్తంగా ప్రారంభించిన ISA.. సూర్యకాంతి అధికంగా ఉండే దేశాలలో సౌర శక్తిని ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చొరవ వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో, ప్రపంచస్థాయిలో పునరుత్పాదక శక్తిని ప్రోత్సహించడంలో భారతదేశం పెద్దన్న పాత్ర పోషించింది.

కోయలిషన్ ఫర్ డిజాస్టర్ రెసిలెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్(CDRI): CDRI 2019లో స్థాపించబడింది. జాతీయ ప్రభుత్వాలు, UN ఏజెన్సీలు, బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకులు, ప్రైవేట్ రంగం ఇందులో భాగస్వామ్యం అయ్యాయి. ఈ భాగస్వామ్యం వాతావరణం, అవస్థాపన వ్యవస్థలలో విపత్తును తట్టుకునేలా పని చేస్తుంది.

గ్లోబల్ బిగ్ క్యాట్ అలయన్స్: ప్రపంచవ్యాప్తంగా ఏడు బిగ్ క్యాట్స్‌ను సంరక్షించేందుకు కొత్త ఇనిషియేటివ్ ప్రారంభించింది భారత్. ఈ చొరవ వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ నిర్వహణ పట్ల భారతదేశం నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.

గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్: దీనిని భారతదేశం G20 ప్రెసిడెన్సీ కింద ప్రాధాన్యతలలో ఒకటిగా ప్రకటించింది. ఈ చొరవ బ్రెజిల్, భారతదేశం, యునైటెడ్ స్టేట్స్‌తో సహా ప్రముఖ జీవ ఇంధన ఉత్పత్తిదారులు, వినియోగదారులను కలిసి సహకారాన్ని సులభతరం చేయడానికి.. ముఖ్యంగా ఇది రవాణా రంగంలో స్థిరమైన జీవ ఇంధనాల వినియోగాన్ని తీవ్రతరం చేయడానికి కృషి చేస్తుంది.

గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్: COP28 సందర్భంగా PM మోదీ ప్రారంభించిన ఈ కార్యక్రమం, గ్రీన్ క్రెడిట్‌ల కోసం ప్రపంచ మార్కెట్‌ను సృష్టించడం, పర్యావరణ అనుకూల పద్ధతులను ప్రోత్సహించడం, దేశాల అంతటా స్థిరమైన అభివృద్ధిని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..