Jnanavapi – Supreme Court: కాశీ జ్ఞానవాపి మసీదు వివాదం చినికి చినికి గాలివానగా మారుతోంది. మసీదులో శివలింగం లభించిన ప్రాంతాన్ని సీల్ చేయాలన్న ఆదేశాలపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది జ్ఞానవాపి మసీదు కమిటీ. దాంతో కాశీ జ్ఞానవాపి వివాదం సుప్రీంకోర్టుకు చేరుకుంది. మసీదులో శివలింగం లభించిన ప్రాంతాన్ని సీల్ చేయాలని వారణాసి కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ జ్ఞానవాపి మసీదు కమిటీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరుగనుంది.
జ్ఞానవాపి మసీదులో కోర్టు ఆదేశాలతో సర్వే పూర్తయ్యింది. మసీదు బావిలో శివలింగం ఉన్నట్టు హిందూ సంస్థల తరపు న్యాయవాది వెల్లడించారు. శివలింగం లభించిన ప్రాంతాన్ని సీల్ చేయాలన్న హిందూ సంస్థల తరపు న్యాయవాది పిటిషన్ను కోర్టు అంగీకరించింది. వెంటనే ఆ ప్రాంతాన్ని సీల్ చేయాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో శివలింగం ఉన్న ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ సీల్ చేశారు. అయితే హిందూ సంస్థల తరపు న్యాయవాది చెప్పినట్టు మసీదులో శివలింగం లేదని అంటున్నారు ముస్లిం సంస్థల తరపు న్యాయవాది. బావిలోని ఫౌంటేన్ను చూసి శివలింగమని అబద్దాలాడుతున్నారని తెలిపారు.
సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్దంగా జ్ఞానవాపి మసీదులో సర్వే జరిగిందని ఆరోపించారు మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. ముస్లింలు ఇప్పటికే బాబ్రీ మసీదును కోల్పోయారని, జ్ఞానవాపి మసీదును వదులుకునే ప్రసక్తే లేదన్నారు. జ్ఞానవాపి మసీదు వివాదంపై సుప్రీంకోర్టు ఏ నిర్ణయం వెల్లడిస్తుందన్న విషయంపై ఉత్కంఠ నెలకొంది. సీల్ చేసిన ప్రాంతానికి భద్రత కల్పించాలని వారణాసి డీఎం, పోలీస్ కమిషనర్, సీఆర్పీఎఫ్ కమాండంట్లకు కోర్టు ఆదేశాలిచ్చింది. సర్వేలో సమగ్ర సాక్షాలు లభ్యమైనట్టు జ్ఞానవాపి కేసులో పిటిషనర్ సోహన్ లాల్ ఆర్య తెలిపారు. ‘‘బాబా మిల్ గయే’’ అంటూ సమాధానమిచ్చారు హిందువుల తరఫు అడ్వకేట్ మోహన్ యాదవ్. 12 అడుగుల 8 అంగుళాల వ్యాసార్ధంలో శివలింగం ఉన్నట్టు చెప్పారు.