న్యూఢిల్లీ, జులై 25: సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు నీట్ యూజీ 2024 సవరించిన (రివైజ్డ్ రిజల్ట్స్) ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. నీట్ యూజీ ప్రవేశ పరీక్షను రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసిన తర్వాత సవరించిన ఫలితాలను ప్రకటించారు. ఈ ఏడాది జూన్ 4వ తేదీన ప్రకటించిన నీట్ యూజీ ఫలితాల్లో ఏకంగా 67 మందికి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రావడం వివాదానికి తెరలేపింది. విద్యార్ధుల ఆందోళనల నేపథ్యంలో ఐఐటీ-ఢిల్లీ నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అందించిన నివేదిక ఆధారంగా.. ఫిజిక్స్లో అటామిక్ థియరీ ప్రశ్నకు సంబంధించిన 29వ ప్రశ్నకు 2 సరైన సమాధానాలు ఉన్నాయని గతంలో ఓ విద్యార్ధి ఎత్తి చూపాడు. ముగ్గురు నిపుణులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసి మరుసటి రోజు మధ్యాహ్నానికి నిర్దిష్ట ఫిజిక్స్ ప్రశ్నకు సరైన సమాధానానికి సంబంధించిన నివేదికను సమర్పించాలని ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఐఐటీ ఢిల్లీ నిపుణులు ఆ ప్రశ్నకు సరైన ఆప్షన్ 4 అని తేల్చడంతో. నాలుగు ఆప్షన్లలో సరైన సమాధానం ఇచ్చిన వారికి మాత్రమే మార్కులు కలపాలని, మిగతా వారికి తొలగించాలని కోర్టు ఆదేశించింది.
ప్రారంభంలో తప్పుగా సమాధానం ఇచ్చిన వారికి కూడా మార్కులు కేటాయించాలని కోర్టు నిర్ణయించింది. అయితే మంగళవారం నాటి ధర్మాసనం తీర్పులో ఒకేఒక సరైన సమాధానాన్ని మాత్రమే అంగీకరిస్తామని, ఇతర సమాధానాలకు మార్కులు ఇవ్వబోమని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీంతో తాజాగా విడుదల చేసిన స్కోర్కార్డ్ 2024లో ఈ సర్దుబాటు కారణంగా దాదాపు 4.2 లక్షల మంది విద్యార్థుల స్కోర్ మారింది. తప్పు సమాధానం ఇచ్చినా.. గతంలో కలిపిన మార్కులను వీరందరికీ తొలగించారు. దీంతో ఈ నాలుగు లక్షల మంది విద్యార్థులు ఒక్కొక్కరు ఐదు మార్కుల చొప్పున కోల్పోవల్సి వచ్చింది. అలాగే టాప్ స్కోరర్ల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. ఐఐటీ-ఢిల్లీ నిపుణుల కమిటీ నివేదికను సుప్రీం కోర్టు ఆమోదించడంతో ఈ అభ్యర్థులంతా 5 మార్కులను కోల్పోవల్సి వచ్చింది. నీట్ యూజీ పరీక్షలో ప్రతి తప్పు సమాధానానికి 5 మార్కుల కోత ఉంటుందనే సంగతి తెలిసిందే.
NEET UG 2024 పరీక్షను రద్దు చేసి మళ్లీ పరీక్షించాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లను కూడా సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. పరీక్షకు సంబంధించిన వ్యవస్థాగత లీక్లు, అవకతవకలకు ఎలాంటి ఆధారాలు లేవని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. కేవలం కొన్ని పరీక్ష కేంద్రాల్లోనే లీక్లు జరిగినట్లు కోర్టు నిర్ధారించింది. మళ్లీ పరీక్ష నిర్వహిస్తే 24 లక్షల మంది విద్యార్ధులపై ప్రభావం పడుతుందని కోర్టు స్పష్టం చేసింది.