Fake bomb threat call : పబ్జీ పేరు వింటే చాలు.. చాలా మంది విసుక్కుంటారు.. మరి కొంతమంది ఆ ఆటే ప్రాణంగా భావిస్తారు. ముఖ్యంగా చిన్న పిల్లల్లో పబ్జీ (PUBG) ఆట ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ఆట వ్యసనంలో పడి చాలా మంది ప్రాణాలు సైతం తీసుకున్నారు. మరికొంతమంది మానసిక రోగులుగా మారారు. అందుకే పబ్జీ గేమ్ను బ్యాన్ చేయాలంటూ సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతుంటాయి. తాజాగా.. పబ్జీ ఆటలో మునిగిన ఓ బాలుడు.. పోలీసులకే షాకిచ్చాడు. తనతో గేమ్ ఆడుతున్న ఫ్రెండ్ ట్రైన్ టైమ్ అవుతుందని తెలిసి.. స్టేషన్లో బాంబు పెట్టినట్లు బెదిరింపు కాల్ చేశాడు. దీంతో రెండు గంటలపాటు రైళ్ల రాకపోకలను ఆపివేశారు అధికారులు. ఈ షాకింగ్ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు (Bengaluru) యలహంక రైల్వేస్టేషన్లో చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మార్చి 30న బెంగళూరులోని యలహంక రైల్వేస్టేషన్లో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. గతనెల 30న మధ్యాహ్నం 2గంటలకు (Yelahanka railway station) రైల్వే పోలీసులకు ఓ ఫోన్ వచ్చింది. రైల్వే స్టేషన్లో బాంబు పెట్టాం.. అంటూ ఓ వ్యక్తి హెచ్చరించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు స్టేషన్ లోపల ఉన్న ప్రయాణికులను బయటకు పంపారు. వెంటనే.. రైల్వే పోలీసులు, బాంబు నియంత్రణ దళ సభ్యులు గంటన్నరపాటు తనిఖీలు చేపట్టారు. చివరకు బాంబు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. ఫేక్ కాల్ అని నిర్ధారించుకున్న తర్వాత ఆ ఫోన్ కు అధికారులు చాలాసార్లు ఫోన్ చేశారు. కానీ ఫోన్ స్విచ్ఆఫ్ వచ్చింది. అయితే.. అది ఎక్కడినుంచి వచ్చిందనే విషయంపై దర్యాప్తు చేపట్టారు అధికారులు.
అయితే.. ఫోన్ లోకేషన్ యలహంకలోని వినాయక్ నగర్లో ఉన్న ఇల్లు అని కనుగొన్నారు. స్టేషన్లో బాంబు పెట్టినట్లు ఫోన్ చేసి బెదిరించింది 12 ఏళ్ల బాలుడని పోలీసులు గుర్తించారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫోన్నే బాలుడు ఉపయోగించాడని అధికారులు పేర్కొన్నారు. ఆ తర్వాత బాలుడిని అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నించారు. ఈ సమయంలో బాలుడు చెప్పిన విషయాలు పోలీసులను విస్మయానికి గురిచేశాయి. తాను.. తన స్నేహితుడు పబ్జీ ఆడుతున్నామని.. ఆట మధ్యలో ఉందని పేర్కొన్నాడు. ఈ సమయంలో తనమ స్నేహితుడు కాచిగూడ ఎక్స్ప్రెస్లో వేరే ఊరు వెళ్లాల్సి ఉందని.. అతను వెళ్తే ఆట ఆగిపోతుందని.. ఎలాగైనా గెలవాలనే ఉద్దేశ్యంతో ట్రైన్ను ఆపాలనుకున్నట్లు బుడ్డోడు వెల్లడించాడు. అందుకే బాంబు ఉందని ఫోన్ చేశానని తెలిపాడు.
అయితే.. బాలుడి నుంచి వివరాలు సేకరించిన అధికారులు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కేసు నమోదు చేయకుండా హెచ్చరించి విడిచిపెట్టారు. పబ్జీకి అడిక్ట్ అయిన బాలుడి తల్లిదండ్రులను కూడా హెచ్చరించి పంపించారు.
Also Read: