జమ్మూ కశ్మీర్లో (Jammu – Kashmir) ఉగ్రవాదులు మరోసారి తమ వక్రబుద్ధి చాటుకున్నారు. షోపియాన్ ఆపిల్ తోటలో ఉన్న సునీల్ కుమార్, పింటూ కుమార్ అనే కశ్మీరీ పండిట్ సోదరులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు గాలిస్తున్నారు. కాగా ఈ ఘటనను మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఖండించారు. కశ్మీర్లో పండిట్లకు భద్రత లేదని, శాంతి భద్రతలను కాపాడడంలో కేంద్రం విఫలమైందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను ఖండిస్తూ స్థానికులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. శ్రీనగర్ లాల్చౌక్లో కాగడాల ర్యాలీ ప్రదర్శించారు. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కశ్మీరీ పండిట్లను కాపాడాని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తరచుగా ఇలాంటి దాడులు జరుగుతున్నాయని, తమకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా.. ఈ ఏడాది మే నెలలో బుద్గామ్లోని ప్రభుత్వ కార్యాలయంలో కశ్మీరీ పండిట్ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ ఘటనతో కశ్మీరీ పండిట్లు ఉలిక్కి పడ్డారు. తమకు రక్షణ లేదంటూ వారి నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. అప్పటి నుంచి 5 వేల మంది వరకు కశ్మీరీ పండిట్ ఉద్యోగులు విధులకు హాజరు కావడం లేదు. గతేడాది అక్టోబర్ లో వీరిపై దాడులు మరింత అధికమయ్యాయి. ఐదు రోజుల్లోనే ఏడుగురు పౌరులు మరణించగా.. వారిలో ఒక కశ్మీరీ పండిట్, ఒక సిక్కు, ఇద్దరు వలస హిందువులు ఉండటం గమనార్హం.
మరిన్ని జాతీయ వార్తల కోసం