గవర్నమెంట్ స్కూల్లో చదివే స్టూడెంట్స్ అందరికి వచ్చే విద్యా సంవత్సరం నుంచి జగనన్న విద్యా కానుక కిట్లు అందజేయాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం క్యాంపు కార్యాలయంలో… విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సంబంధిత అధికారులతో సమావేశమైన జగన్… ‘జగనన్న గోరుముద్ద’, ‘విద్యాకానుక’, ‘మనబడి నాడు నేడు’ పథకాలపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కొత్త పాఠ్యపుస్తకాలు, వర్క్బుక్లను సీఎం పరిశీలించారు. 3 జతల యూనిఫాంకు సరిపోయే వస్త్రం, నోటు పుస్తకాలు, బ్యాగ్, బూట్లు, సాక్సులు, బెల్టుల పంపిణీపై పలు సూచనలు చేశారు. కాంపిటీటివ్ టెండర్లు పిలిస్తే ధరలు తగ్గే అవకాశం ఉందని..ఆ దిశగా ప్రణాళికలు సిద్దం చేయమని చెప్పారు.
ఉపాధ్యాయుల శిక్షణ సహా వర్క్బుక్, టెక్ట్స్బుక్, కరిక్యులమ్ల విషయంలో అధికారుల పనితీరును సీఎం అభినందించారు. విద్యార్థుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్ సిద్ధం చేయాలని జగన్ సూచించారు. మానసిక వికలాంగుల కోసం… పులివెందుల విజేత స్కూల్ తరహాలో ప్రతి నియోజకవర్గంలో ఒక స్కూల్ ఉండేలా తక్షణమే ఏర్పాట్లు చేయాలన్నారు సీఎం. 6వ తరగతి నుంచే ఇంటర్నెట్ వినియోగంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
ఇది కూడా చదవండి :హీరో ధనుష్కు మదురై హైకోర్టు షాక్..బర్త్ సర్టిఫికెట్ ఎక్కడ..?