తిరుపతి బీజేపీలో విభేదాలు.. నేతలిద్దరిది చెరో దారి
తిరుపతి బీజేపీలో నాయకుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించదానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి తిరుపతి వస్తున్న సందర్భంలో బీజేపీ ఎలాంటి నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వలేదంటూ పత్రికా ప్రకటన విడుదల చేయడం ద్వారా...
తిరుపతి బీజేపీలో నాయకుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించదానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి తిరుపతి వస్తున్న సందర్భంలో బీజేపీ ఎలాంటి నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వలేదంటూ పత్రికా ప్రకటన విడుదల చేయడం ద్వారా బీజేపీ తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జీ సన్నారెడ్డి దయాకరరెడ్డి విభేదాలకు ఆజ్యం పోశారు. డిక్లరేషన్పై గళమెత్తిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి ఈ ప్రకటనతో సంబంధం లేకుండా నిరసన కొనసాగించారు.
జగన్ పర్యటన సందర్భంగా నిరసన తెలపాలంటూ మీడియాలో వస్తున్న కథనాలు పార్టీ విధాన నిర్ణయం కాదని దయాకర్ రెడ్డి పేర్కొన్నారు. అదే సమయంలో సీఎం జగన్ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతనే శ్రీవారి సందర్శనకు వెళ్ళాలంటూ భానుప్రకాశ్ రెడ్డి నిరసన కొనసాగించారు. ఇంట్లోంచి రోడ్డు మీదికి వచ్చి ఆందోళన చేసేందుకు భాను ప్రకాష్ రెడ్డి ప్రయత్నించారు. ఒకవైపు భానుప్రకాశ్ రెడ్డి నిరసన వ్యక్తం చేస్తుంటే.. పార్టీ ఎలాంటి నిరసనకు పిలుపునివ్వలేదంటూ దయాకర్ రెడ్డి పత్రికా ప్రకటన విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది. కమలనాథుల మధ్య సఖ్యత లేదన్న విషయం ఈ అంశంతో తేలిపోయిందని పలువురు కామెంట్ చేయడం తిరుపతిలో వినిపిస్తోంది.