Four leaders in TPCC race but Revanth, Komatireddy ahead: తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ పదవి కోసం పోటీ తీవ్రమైంది. రేసులో చాలా మంది కనిపిస్తున్నా.. రేసులో ప్రధానంగా నలుగురి మధ్య నెలకొందని గాంధీభవన్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఆ నలుగురిలో తానే ముందున్నా అనుకుంటున్న మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి దూకుడు పెంచి షాక్ ఇచ్చారు. దాంతో రేవంత్ రెడ్డి పెట్టుకున్న ఆశలు నెరవేరేనా అన్న సందేహాలు టీ.కాంగ్రెస్ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయం నుంచి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షున్ని మారుస్తారన్న ప్రచారం మొదలైంది. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలు, హుజూర్నగర్ ఎన్నికల తర్వాత నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉద్వాసన తప్పదన్న వార్తలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు టీ.కాంగ్రెస్ నేతలు టీపీసీసీ అధ్యక్ష పదవి కోసం ఢిల్లీలో పైరవీలు ముమ్మరం చేశారు. రాహుల్ గాంధీ ఆశీస్సులతో పార్టీలోకి వచ్చిన ఎంపీ రేవంత్ రెడ్డికి టీపీసీసీ పగ్గాలు అప్పగిస్తారని, పార్టీలో చరిష్మా ఉన్న నేతగా ఆయన్ని రాహుల్ గాంధీ భావిస్తున్నారని చెప్పుకున్నారు. రేసులో పలు పేర్లు వినిపిస్తున్నా.. రేవంత్ రెడ్డినే కాబోయే టీపీసీసీ చీఫ్ అని ప్రచారం జరిగిది.
అయితే.. ఇటీవల పార్టీలోకి వచ్చిన రేవంత్ రెడ్డిని అధ్యక్షునిగా చూడడం ఇష్టం లేని పలువురు ఆయనకు వ్యతిరేకంగా ఢిల్లీలో లాబీయింగ్ షురూ చేశారు. మరోవైపు తాము కూడా టీపీసీపీ అధ్యక్ష పదవికి అర్హులమంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ మంత్రులు మర్రి శశిధర్ రెడ్డి, శ్రీధర్ బాబు డిల్లీలో పైరవీలు ప్రారంభించారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డిల మధ్యే ప్రధాన పోటీ వుందని చెప్పుకుంటున్నాయి గాంధీ భవన్ వర్గాలు.
టీపీసీసీ అధ్యక్షుడయ్యేందుకు అన్ని విధాలా తాను అర్హున్నని చెబుతున్న కోమటిరెడ్డి.. రేవంత్కు పదవి ఇస్తే వేరు కుంపటి తప్ప వేరే దారి లేదని అంతర్గత సమావేశాల్లో అంటున్నట్లు చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా తనకు పదవి రావడం కంటే రేవంత్కు రాకుండా చేయడమే కోమటిరెడ్డి లక్ష్యమని చెప్పుకునే వారూ వున్నారు. ఇంకో వారం, పది రోజుల్లో కథ క్లైమాక్స్కు వస్తుందని అంటున్నారు కాంగ్రెస్ నేతలు.
Read this: కేసీఆర్కు అరుదైన గౌరవం KCR got rare invitation