రైతన్నల కోసం ఏపీలో జనసేన పోరుబాట, జిల్లా కలెక్టర్లకు విజ్ఞాపన పత్రాలు.. కృష్ణాజిల్లా చేరుకున్న పవన్ కళ్యాణ్
జనసేనపార్టీ ఆంధ్రప్రదేశ్ లో పోరుబాటకు సిద్ధమైంది. తుఫాన్ బాధిత రైతులను తక్షణమే ఆదుకోవాలంటూ ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు..
జనసేనపార్టీ ఆంధ్రప్రదేశ్ లో పోరుబాటకు సిద్ధమైంది. తుఫాన్ బాధిత రైతులను తక్షణమే ఆదుకోవాలంటూ ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. రైతన్నకు సాయం చేయాలంటూ రాష్ట్రంలోని ఆయా జిల్లాల కలెక్టర్లకు విజ్ఞాపన పత్రాలు అందజేస్తున్నారు జనసైనికులు. ఇందులో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మచిలీపట్నంలో కృష్ణాజిల్లా కలెక్టర్ ను కలిసి స్వయంగా విజ్ఞాపన పత్రం అందించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే కృష్ణాజిల్లాకి వచ్చిన పవన్, కంకిపాడు నుంచి కొంచెం సేపటిక్రితం గుడివాడ చేరుకున్నారు. అక్కడ నిర్వహించతలపెట్టిన భారీ బహిరంగ సభలో పవన్ ప్రసంగిస్తారు. కృష్ణాజిల్లా పర్యటన సందర్భంగా పవన్ కు జనసైనికులు దారిపొడవునా బ్రహ్మరథం పడుతున్నారు. పవన్ టూర్ లైవ్ అప్డేట్స్ దిగువున..
LIVE NEWS & UPDATES
-
పేకాట క్లబ్బులు రన్ చేసేందుకు పెడుతున్న శ్రద్ధ, రాష్ట్రాభివృద్ధి మీద లేదు: పవన్
వైసీపీ ప్రజాప్రతినిధులు పేకాట క్లబ్బులు రన్ చేసేందుకు పెడుతున్న శ్రద్ధ, రాష్ట్రాభివృద్ధి మీద పెట్టడంలేదని పవన్ కళ్యాణ్ గుడివాడ సెంటర్లో నిర్వహించిన రోడ్ షో లో విమర్శించారు. రాష్ట్రంలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని పవన్ అన్నారు. ‘పేకాటక్లబ్బులు, సిమెంట్ ఫ్యాక్టరీలు రన్ చేసుకుంటూ వీళ్లు రాజకీయాలు చేయొచ్చు.. మనం సినిమాలు చేస్తూ రాజకీయాలు చేయకూడదా’ అని పవన్ ప్రశ్నించారు. రోజులు మారుతున్నాయని, గతంలోలా నిరంకుశ రాజకీయాలకు ప్రజలు చరమగీతం పాడే రోజులివని పవన్ అన్నారు. గుడివాడ ప్రజలు తనకు స్వాగతం పలికిన తీరు, ప్రజల్లో వస్తున్న స్పందన జీవితాంతం గుర్తుంచుకుంటానని పవన్ చెప్పారు. అనంతరం ఆయన మచిలీపట్నంకు బయలు దేరి వెళ్లారు.
-
గుడివాడ సభా ప్రాంగణం వద్దకు చేరుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్
ఇటీవలి తుఫాను ప్రభావంతో పంటనష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ ఇవాళ పోరుబాట పట్టిన జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గుడివాడలో ప్రజలనుద్దేశించి ప్రసంగించబోతున్నారు. ఇందుకోసం ఆయన ఇప్పటికే, సభా ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. గుడివాడలో జనసేనానిని వివిధ కూడళ్లలో అభిమానులు పవన్ ను గజమాలలతో సత్కరిస్తున్నారు. పెడన మార్గమధ్యలో రైతుల పొలాల వద్ద దిగి తడిచిన ధాన్యాన్ని జనసేనాని పరిశీలించారు. రైతుల కష్టసుఖాలను అడిగితెలుసుకునే ప్రయత్నం చేశారు.
-