Hyderabad city Bus Services: కరోనా లాక్డౌన్ సమయంలో ఆర్టీసీ బస్సు చక్రం కూడా ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే అనంతరం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపుల ఆధారంగా క్రమంగా బస్సులు రోడ్డెక్కాయి. ఇదిలా ఉంటే జిల్లాల్లో పూర్తి స్థాయిలో బస్సు సర్వీసులు నడుస్తోన్నా.. హైదరాబాద్లో మాత్రం ఇంకా 100 శాతం బస్సులు నడవడం లేదు.
ప్రస్తుతం కేవలం 50 శాతం మేరకే సిటీ బస్సులు నడుస్తున్నాయి. దీంతో నగరంలో ఆర్టీసీ బస్సులపై ఆధారపడి ప్రయాణాలు కొనసాగిస్తున్న వారికి తీవ్ర ఇబ్బందిగా మారింది. ఇక తాజాగా నగర వాసులకు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శుభవార్త చెప్పారు. సిటీ బస్సులను 75 శాతం పెంచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకారం తెలిపారని వెల్లడించారు. తెలంగాణ ఆర్టీసీ స్థితిగతులపై ప్రగతి భవన్లో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం ఓకే చెప్పారని మంత్రి తెలిపారు. సిటీ సర్వీసులు పెరగడం వల్ల నగర ప్రయాణికులకు ఇబ్బందులు తగ్గుతాయని మంత్రి వివరించారు. మరి ఈ నిర్ణయం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందో చూడాలి.