రైల్వే వ్యవస్థలో భారీ మార్పులను చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా ఇప్పటికే రైళ్లను ఆధునీకరిస్తోంది. అంతేకాకుండా ప్రయాణికుల నిరీక్షణను దూరం చేసేందుకు సమయానికి రైలు బండిని నడిపించేలా యాక్షన్ ప్లాన్ తీసుకొచ్చింది. ఇప్పుడు తాజాగా దక్షిణ మధ్య రైల్వే తన నెట్ వర్క్ పరిధిలో వేగం పెంపుతో పాటు ప్రయాణికులకు మెరుగైన రవాణా సేవల కోసం పటిష్టమైన ఆధునీకరణ చర్యలకు శ్రీకారం చుట్టింది. కాజీపేట-బల్లార్ష సెక్షన్లోని మంచిర్యాల-పెద్దంపేట మార్గం ఉత్తరాది నుంచి దక్షిణాది రాష్ట్రాలకు ఎంట్రెన్స్ గేట్ లాంటిది.
ఈ మార్గంలో ఉన్న గోదావరి నది వంతెనపై 100 కి.మీ. గరిష్ఠ వేగంతో రైళ్లు పరుగులు పెట్టించేందుకు రైల్వేబోర్డు తాజాగా ఓకే చేసింది. ఇప్పటివరకూ మంచిర్యాల-పెద్దంపేట మధ్య (9 కి.మీ. దూరం) 80 కి.మీ. మధ్యలో గోదావరి వంతెన మీద 50 కి.మీ. గరిష్ఠ వేగ పరిమితి ఉంది.
అయితే.. ఈ రైలు మార్గాన్ని పటిష్టం చేసి వేగంను పెంచేందుక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రైలు స్పీడ్ పరిమితిని 100 కి.మీ.కు పెంచారు. ఇక్కడ గోదావరి నదిపై గతంలో రెండు లైన్లు ఉండగా.. ఇటీవల మూడో ట్రాక్ నిర్మించారు. వేగ పరీక్షలు విజయవంతం కావడంతో వేగపరిమితిని పెంచారు. రైళ్ల వేగవంతం ఈ మార్గంలో రద్దీ నివారణకు తోడ్పడుతుందని ద.మ.రైల్వే జీఎం గజానన్ మల్య మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.