Bheemla Nayak: పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత ‘త్రివిక్రమ్’ అందిస్తుండగా నిర్మాత సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ‘భీమ్లా నాయక్’ రెండో సాంగ్ విజయదశమి సందర్భంగా విడుదల అయింది. ‘భీమ్లా నాయక్’ తో ‘అంత ఇష్టమేందయ‘ అంటూ పాటందుకున్న ‘నిత్య మీనన్. ఈ గీతాన్ని వినగానే చిత్ర కథాంశం ను అనుసరించి రామజోగయ్య శాస్త్రి సాహిత్యంలో ఆవిష్కృతం అయిన ప్రేమానురాగాల గీతం ఇది అనిపిస్తుంది. వీనుల విందుగా సాగిన తమన్ స్వరాలు ఈ గీతాన్ని మరో స్థాయికి చేర్చాయి. ఇక ఈ పాట విడుదలైన కొద్దీ గంటల్లోనే రికార్డుల వేట మొదలు పెట్టింది. విడుదలైన 17 గంటల్లోనే ఈ పాట 2 మిలియన్ వ్యూస్ ను దక్కించుకుంది. ముందు ముందు ఈ పాట మరిన్ని రికార్డులను సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.
భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలను వ్యక్త పరచ గలిగే పాటలు గతంలో వచ్చాయి కానీ ఆ భావం ఎప్పటికప్పుడు నిత్య నూతనం. నిత్యామీనన్ దృష్టికోణంలోనుంచి తన పట్ల భర్త తాలూకు ప్రేమ ఏ పతాక స్థాయిలో ఉన్నదో ఈ పాటలో చక్కగా కొత్తగా అలతి పదాల్లో కుదిరింది. అతితక్కువ సమయంలో రాయడం బాణీ కట్టడం జరిగిపోయాయి.దాదాపు ఒక గంట వ్యవధిలో పాట రూపకల్పన జరిగింది. వెంటనే శ్రీ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్, సాగర్ చంద్ర గారు వినడం,ఆస్వాదించి ఆమోదించడం జరిగిపోయింది. తమన్ చక్కటి బాణీకి చిత్రగారి స్వరం ప్రాణం పోసి పాట ఔన్నత్యాన్ని మరింత ఇనుమడింప చేసిందనడంలో ఏమాత్రం సందేహం లేదు అన్నారు ఈ పాట గురించి గీత రచయిత రామ జోగయ్య శాస్త్రి. 2022 జనవరి 12 న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు మేకర్స్. ఈసినిమాలో నిత్య మీనన్, సంయుక్త మీనన్ నాయికలు. ప్రముఖ నటులు, రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు, నర్రా శ్రీను , కాదంబరికిరణ్, చిట్టి, పమ్మి సాయి, చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :