woman attack on childrens: కనిపెంచిన తల్లె.. తన పిల్లలపై కర్కషంగా వ్యవహరించింది. జాలి, దయ అన్నది లేకుండా పిల్లలకు అట్లకాడతో వాతలు పెట్టింది. ఇదంతా ఎందుకు చేసిందనుకుంటున్నారు.. భర్తపై కోపంతో ఇద్దరు పిల్లలపై తన ప్రతాపాన్ని చూపించింది. సహనంతో ఉండాల్సిన ఆమె.. ఇలా వ్యవహరించడంపై అందరూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ సంఘటన హైదరాబాద్ పట్టణంలో వెలుగుచూసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నగరంలోని సనత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోరబండ వి.రామారావునగర్లో రాజు, పావని దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి కుమారుడు జ్ఞానేశ్వర్ (5), కూతురు మహాలక్ష్మి (4) సంతానం. కాగా.. ఈ నెల 23న ఈ దంపతులు చిన్న విషయమై గొడవపడ్డారు. భర్తపై ఉన్న కోపాన్ని పావని కర్కషంగా వ్యవహరించింది. తన భర్తపై కోపాన్ని ఎలా తీర్చుకోవాలో తెలియక.. తమ ఇద్దరు పిల్లలపై చూపింది. రాజు లేని సమయంలో.. పిల్లలిద్దరిన తీవ్రంగా కొట్టడమే కాకుండా అట్లకాడను వేడిచేసి చేతులు, కాళ్లపై వాతలు పెట్టింది. బాధలు భరించలేక పిల్లలు గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు ఇంటికి వచ్చారు. ఈ ఘటనకు సంబంధించి అందరూ పావనిపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఈ క్రమంలో స్థానిక అంగన్వాడీ టీచర్ జరిగిన సంఘటనను జిల్లా సంక్షేమ అధికారి దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం లీగల్ కమ్ ప్రొబేషన్ అధికారి సుజాత ఈ నెల 25న సనత్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో పావని ఇలా చేశానంటూ ఒప్పుకోవడంతో.. ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ చిన్నారులు జ్ఞానేశ్వర్, మహాలక్ష్మి సంరక్షణను శిశువిహార్కు అప్పగించారు. వారికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు.
Also Read: