Minister Harishrao Interacts with Corona Patients: సిద్దిపేట జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగులను మంత్రి హరీష్ రావు పరమర్శించారు. ఆత్మీయంగా పలుకరించి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. అన్నం పెడుతున్నారా.. వసతులు ఎలా ఉన్నాయా.. మంచిగా చూసుకుంటున్నారా.. అంటూ కోవిడ్ బాధితులను అడిగి మంత్రి తెలుసుకున్నారు. మీకేం కాదు.. ధైర్యంగా ఉండండి.. తాను ఉన్నానంటూ వారిలో హరీష్ రావు మనోధైర్యం నింపారు.
కోవిడ్ చికిత్స విధానాన్ని పరిశీలించేందుకు, కోవిడ్ పేషెంట్లకు భరోసానిచ్చి, ధైర్యం నింపేందుకు బుధవారం సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని మంత్రి హరీష్ రావు సందర్శించారు. పీపీఈ కిట్ ధరించకుండానే కోవిడ్ వార్డుల్లో కలయ తిరిగారు. కోవిడ్ కష్టకాలంలో వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలు మరువరానివన్నారు. వైద్యాధికారులు, డాక్టర్లు, నర్సులు, సిబ్బంది సేవలను హరీష్ రావు ప్రశంసలతో ముంచెత్తారు.
ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు వైద్యాధికారులకు కీలక సూచనలు చేశారు. కోవిడ్ బాధితులకు చికిత్స అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, బాధితులు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. అవసరమైతే మరింత ఆక్సిజన్, అత్యవసర మందులు సరఫరా చేస్తామన్నారు. కోవిడ్ బాధితులు ధైర్యం కోల్పోవద్దని అన్ని విధాలుగా వైద్య సదుపాయాలు సమకూర్చేందుకు రాష్ట్ర సర్కార్ సిద్ధంగా ఉందన్నారు.
Read Also… విటమిన్-C ఎక్కువగా తీసుకుంటున్నారా! అయితే జాగ్రత్త..! ఎంత సరిపోతుందో తెలుసా..!