ఇవాళ కేబినెట్ భేటీ.. లాక్‌డౌన్ ఉంటుందా..? ఉండదా..?

|

Jul 01, 2020 | 10:19 AM

తెలంగాణల కేబినెట్‌ ఇవాళ భేటీ అవుతోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కేసులు రోజురోజుకు పెరిగిపోవడం, మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారనే ప్రచారం జరగడంతో ఇవాళ్టి కేబినెట్‌ భేటీ ..

ఇవాళ కేబినెట్ భేటీ.. లాక్‌డౌన్ ఉంటుందా..? ఉండదా..?
Follow us on

తెలంగాణల కేబినెట్‌ ఇవాళ భేటీ అవుతోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కేసులు రోజురోజుకు పెరిగిపోవడం, మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారనే ప్రచారం జరగడంతో ఇవాళ్టి కేబినెట్‌  సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ లాక్‌డౌన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

జీహెచ్ఎంసీ పరిధిలో…

మరోవైపు తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా 945 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 16, 339కి చేరింది. ఇప్పటి వరకు 260 మంది మృతి చెందగా.. 7,294 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇంకా 8,785 యాక్టివ్‌ కేసులున్నాయి. జీహెచ్‌ఎంసీలో కొత్తగా 869 కేసులు నమోదయ్యాయి. దీంతో ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 12,682 కేసులు నమోదయ్యాయి.

మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష..

మరోవైపు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఈటల రాజేందర్‌ సమీక్షించారు. టిమ్స్‌, గాంధీ ఆసుపత్రుల్లో అవసరం అయిన సిబ్బంది నియామకాల ప్రక్రియ ఇప్పటికే చేపట్టారు. ఇంకా  సిబ్బంది ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

హైదరాబాద్ పరిధిలో కరోనా పరీక్షా కేంద్రాలు..

హైదరాబాద్‌లో 11 ఆస్పత్రుల్లో కరోనా పరీక్షల కోసం నమూనాలు సేకరిస్తున్నామని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కింగ్‌ కోఠి హాస్పిటల్‌, ఫీవర్‌ ఆసుపత్రి, చెస్ట్‌ ఆసుపత్రి, ఎర్రగడ్డ ఆసుపత్రి, నేచర్‌ క్యూర్‌ హాస్పిటల్‌, సరోజినీదేవి హాస్పిటల్‌, ఆయుర్వేద ఆసుపత్రి. హోమియోపతి ఆసుపత్రి, నిజామియా టీబీ ఆసుపత్రి, కొండాపూర్‌ ఏరియా హాస్పిటల్‌, వనస్థలిపురం ఏరియా ఆసుపత్రి, నాచారం ఇఎస్‌ఐ ఆసుపత్రి, సరూర్‌నగర్‌ ఇఎస్‌ఐ ఆసుపత్రుల్లో పరీక్షా కేంద్రాలు అందుబాటులో ఉంటాయని అక్కడికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని మంత్రి ఈటల సూచించారు.