ప్రపంచ దేశాలతో పాటుగా భారత్లోనూ కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. ఇక కరోనా వైరస్ సోకిన భాదితులకు వైద్యం కోసం చేసే ఖర్చు అంతా ఇంతా కాదు. కరోనా సోకిన రోగులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. తమకున్న ఇన్సూరెన్స్లు పనిచేయకపోవటం, ఆస్పత్రి బిల్లు లక్షల్లో వస్తుండటంతో బాధితులు బోరుమంటున్నారు. ఇటువంటి తరుణంలో (బీమా రెగ్యులేటర్ )ఐఆర్డిఎఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనాకు నగదు రహిత చికిత్స కోసం ఆసుపత్రి నిరాకరిస్తే, వెంటనే ఫిర్యాదు చేయాలని ఐఆర్డిఎఐ తెలిపింది.
ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ కలిగిన కొందరు లబ్ధిదారులు కరోనా చికిత్స కోసం కొన్ని ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లగా అక్కడ వారు చికిత్సకు నిరాకరించారు. బీమా సంస్థలతో అప్పటికే ఒప్పందాలు ఉన్నప్పటికీ కోవిడ్ -19 చికిత్స కోసం నగదు రహిత సదుపాయాన్ని అనుమతించటం లేదని ఐఆర్డిఎఐ దృష్టికి వచ్చిందని తెలిపింది. అటువంటి ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామని చెప్పింది.
బీమా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్న అన్ని ఆసుపత్రులు పాలసీదారులకు షరతులకు అనుగుణంగా కోవిడ్ -19 తో సహా ఏదైనా చికిత్సకు నగదు రహిత సదుపాయాన్ని అందించాల్సిందేనని స్పష్టం చేసింది. చికిత్సకు నిరాకరించిన ఆస్పత్రులపై ఐఆర్డిఎఐ అధికారిక వెబ్ సైట్ లో ఫిర్యాదు చేయాలని సూచించింది. కస్టమర్ల ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించేలా చూసేందుకు..మరో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని అన్ని బీమా కంపెనీలను కూడా ఐఆర్డిఎ కోరింది.