ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 26వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో ప్రస్తుతం 19వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉండగా.. 800 మందికి పైగా కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి
కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ పలు సూచనలు చేశారు. నోవల్ కరోనా మహమ్మారిని ఓడించాలంటే.. రోజుకు కనీసం 1లక్ష కరోనా టెస్టులు చేయాలని కేంద్రానికి సూచించారు. ఆదివారం ఆయన పోస్ట్ చేసిన ఓ ట్వీట్లో.. కరోనా మహమ్మారిని కట్టడి చేయాలంటే మాస్ రాండమ్ టెస్టింగ్స్ చాలా ఇంపార్టెంట్ అని.. దీనిని నిపుణులు కూడా
అంగీకరిస్తున్నారంటూ పేర్కొన్నారు.
Experts agree that mass random testing is the key to beating Corona. In India, a bottle neck is stopping us from scaling testing from the current 40,000 per day to 1 lakh tests a day, for which test kits are already in stock.
PM needs to act fast & clear the bottleneck.
— Rahul Gandhi (@RahulGandhi) April 26, 2020
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రోజుకు 40 వేల కరోనా పరీక్షలు జరుగుతున్నాయని.. దీనిని 1లక్షకు పెంచేందుకు ప్రయత్నించాలన్నారు. దీనికి వస్తున్న అడ్డంకుల్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం తొలగించాలని ట్వీట్లో పేర్కొన్నారు. ప్రస్తుతం కరోనా టెస్టులు నిర్వహించేందుకు కిట్లు కూడా అందుబాటులోనే ఉన్నాయని.. ప్రధాని నరేంద్ర మోదీనే యాక్టివ్గా వ్యవహరించి కరోనా టెస్టులు ఎక్కువ చేసేలా ప్రయత్నించాలంటూ డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం మే 3వ తేదీన లాక్డౌన్ ముగియనుంది. అయితే ఇంకా అనేక చోట్ల కరోనా వైరస్ అదుపులోకి రాకపోవడంతో.. లాక్డౌన్ కొనసాగించే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం మే 7 వరకు లాక్డౌన్ కొనసాగుతుందని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.