బ్రెజిల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 59 వేల కేసులు నమోదయ్యాయి. దీంతో బ్రెజిల్ వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 23 లక్షలకు చేరువైంది. బ్రెజిల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 59,961 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 22,87,475కి చేరింది. ఇక కరోనా బారినపడి గడిచిన 24 గంటల్లో 1,311 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 84,082కి చేరింది. కాగా, ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యలో బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత మన భారత్ మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇక అగ్రస్థానంలో అమెరికా నిలిచింది.