గగన్ యాన్ ప్రాజెక్టు కోసం ఇస్రో ఎంపిక చేసిన నలుగురు వ్యోమగాములకు మాస్కోలో మళ్ళీ శిక్షణ ప్రారంభమైంది. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా వీరికి కొంతకాలం శిక్షణ నిలిపివేశారు. ఈ నెల 12 నుంచి వీరికి తిరిగి ట్రెయినింగ్ ప్రారంభమైందని రష్యన్ స్పేస్ కార్పొరేషన్..’రాస్ కాస్మోస్’ ప్రకటించింది. గగరిన్ రీసెర్చ్ అండ్ టెస్ట్ కాస్మోనట్ ట్రెయినింగ్ సెంటర్ లో వీరు శిక్షణ పొందుతున్నారని ఈ సంస్థ పేర్కొంది. వీరి ట్రెయినింగ్ కి సంబంధించి రాస్ కాస్మోస్ లో భాగమైన ‘గ్లావ్ కాస్మోస్’కు, ఇస్రోకు మధ్య లోగడ ఒప్పందం కుదిరింది. నలుగురు ఏస్ట్రోనట్లూ ఆరోగ్యంగా ఉన్నారని, అన్ని శానిటరీ, హైజీనిక్ చర్యలూ తీసుకున్నారని ఈ సంస్థ వెల్లడించింది. వీరే కాకుండా తమ సెంటర్ లోని ఉద్యోగులు కూడా మెడికల్ మాస్కులు, గ్లోవ్స్ ధరిస్తున్నారని పేర్కొంది.
రూ. పది వేల కోట్ల గగన్ యాన్ ప్రాజెక్టును 2022 లో లాంచ్ చేయనున్నారు. నలుగురు వ్యోమగాములకు శిక్షణ ఈ ఏడాది ఫిబ్రవరి 10 న ప్రారంభమైంది. లాక్ డౌన్ నేపథ్యంలో వీరి శిక్షణకు బ్రేక్ పడింది. రష్యాలో ట్రెయినింగ్ అనంతరం వీరు మళ్ళీ ఇండియాలో కూడా శిక్షణ పొందాల్సి ఉంటుంది.