భారత్ను కరోనా మహమ్మారి వణికిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో వైరస్ తీవ్ర ఉధృతంగా ఉంది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే జులై 31నాటికి కేసుల సంఖ్య 5.5 లక్షలకు చేరే అవకాశం కనిపిస్తోందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా వ్యాఖ్యానించారు. ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథార్టీ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన..కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్తో భేటీ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో ప్రతి 12 – 13 రోజులకు కేసులు డబుల్ అవుతున్నాయని చెప్పారు. జులై చివరి నాటికి 5.5 లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉందని సిసోడియా అంచనా వేశారు. ఇందుకోసం 80 వేల బెడ్లు అవసరం అవుతాయని చెప్పారు. ఆస్పత్రుల విషయంలో ఢిల్లీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయడంపై పునరాలోచించాలని ఎల్జీని కోరామని, ఆయన దానికి ఒప్పుకోలేదని చెప్పారు. ఢిల్లీలో కరోనా వైరస్ కమ్యూనిటీ స్పెడ్ లేదని సిసోడియా స్పష్టం చేశారు.