రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ మాస్కులు అందజేయాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కోవిడ్ నియంత్రణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. సీఎం అధికారిక నివాసంలో జరిగిన ఈ సమీక్షా సమావేశానికి సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి హాజరయ్యారు. రాష్ట్రం ఒక్కొక్కరికీ మూడు చొప్పున 16 కోట్ల మాస్కుల పంపిణీకి సీఎం ఆదేశాలు జారీ చేశారు. మాస్క్ల వల్ల కరోనా నుంచి కొంత రక్షణ లభిస్తుందన్నారు. వీలైనంత త్వరగా మాస్కులను పంపిణీ చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్లోని 1.47 కోట్ల కుటుంబాల్లో 1.43 కోట్ల కుటుంబాలపై మూడో సర్వే పూర్తయిందని అధికారులు సీఎంకు తెలిపారు. ఈ సర్వే మేరకు మొత్తం 32, 349 మందిని ఎన్ఎం, ఆశావర్కర్లు వైద్యాధికారులకు రిఫర్ చేశారని చెప్పారు.. అలా రిఫర్ చేసిన వారిలో 9,107 మందికి కరోనా పరీక్షలు అవసరమని వైద్యాధికారులు నిర్ధారించారని పేర్కొన్నారు.
అధికారుల నివేధికపై స్పందించిన సీఎం జగన్ మొత్తం 32,349 మందికి కూడా పరీక్షలు చేయాలని ఆదేశించారు. హైరిస్కు ఉన్న వారి పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం అధికారులను ఆదేశించారు. వృద్ధులు, మధుమేహం, బీపీ ఇతరత్రా వ్యాధులతో బాధపడే వాళ్లపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. వీరిలో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే, వెంటనే అత్యుత్తమ ఆస్పత్రుల్లో చేర్పించి వారిపట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అలాగే నమోదవుతున్న కేసులు, వ్యాప్తిచెందడానికి ఉన్న అవకాశాలను దృష్టిలో ఉంచుకుని జోన్లను, క్లస్టర్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు.