కరోనా నేపథ్యంలో దేశంలో లాక్డౌన్ కొనసాగుతోంది.ప్రజలు గడపదాటి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు అన్ని మూతపడ్డాయి. విద్యా,వ్యాపార, రవాణా వ్యవస్థలు స్థంబించిపోయాయి. ఆఖరుకు దేవాలయాలకు కూడా తాళాలు వేశారు. దీంతో దేవుడికి నిత్యకైంకర్యాలు నిర్వహించే అర్చకుల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం జగన్ నిర్ణయంతో వేలాది మంది అర్చకులకు లబ్ఢి చేకూరనుంది.
లాక్డౌన్ నేపథ్యంలో ఆలయాల్లో భక్తుల దర్శనాలు నిలిపివేశారు. దీంతో ఆదాయం కోల్పోయిన అర్చకులను ఆదుకునేందుకు ప్రభుత్వం చొరవ తీసుకుంది. ఈ మేరకు సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో.. చిన్న ఆలయాల్లో పనిచేసే అర్చకులకు రూ. 5,000లు గ్రాంట్ రూపంలో చెల్లించనున్నట్లు దేవదాయ శాఖ మంత్రి శ్రీనివాసరావు తెలిపారు. దేవదాయ శాఖ నుంచి ఎలాంటి నెలవారీ జీతాలు పొందని, ధూప దీప నైవేద్యం వంటి పథకాల ద్వారా లబ్ధి పొందని వారికి అర్చక సంక్షేమ నిధి నుంచి ఈ సాయాన్ని అందజేయనున్నారు.
కరోనా నేపథ్యం, లాక్డౌన్కు ముందు నుంచే ఆలయాల్లోకి భక్తులను అనుమతించడం లేదు. దీంతో అర్చకులు మాత్రమే ఏకాంతంగా నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. చిన్న ఆలయాలకు ఎలాంటి ఆదాయం లేదు.. అర్చకుల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. అందుకే అర్చక వెల్ఫేర్ ఫండ్ ద్వారా ఒక్కొక్కరికి రూ. 5000 గ్రాంట్ ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ధూప దీప నైవేద్యం, అర్చక వెల్ఫేర్ ఫండ్ ద్వారా 2,800 మందికి పైగా అర్చకులకు ప్రతి నెలా ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్నారు. ఈ పథకం వర్తించని వారు రాష్ట్ర వ్యాప్తంగా 2,500 మంది అర్చకులు ఉన్నారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.