నవంబర్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టడం, US ఎన్నికల తరువాత, విలువైన లోహాన్ని సేకరించేందుకు కొన్ని సెంట్రల్ బ్యాంకులకు అదనపు ప్రోత్సాహాన్ని అందించి ఉండవచ్చునని నివేదిక స్పష్టం చేసింది. ఇతర సెంట్రల్ బ్యాంకుల మాదిరిగానే ఆర్బిఐ కూడా బంగారాన్ని సురక్షితమైన ఆస్తిగా కొనుగోలు చేస్తోంది. ఇందులో భాగంగానే నవంబర్ 2024లో 8 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేయడం ద్వారా ఆర్బీఐ సరికొత్త రికార్డు సృష్టించింది.
జనవరి 3తో ముగిసిన వారానికి భారత విదేశీ మారక నిల్వలు 5.7 బిలియన్ డాలర్లు తగ్గి 634.59 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. అయితే, గణాంకాల ప్రకారం, భారత్లో మొత్తం బంగారం నిల్వలు 876 టన్నులకు చేరుకున్నాయి.
2024లో అత్యధిక బంగారం కొనుగోలు చేసిన దేశాల్లో ఆర్బీఐ రెండో స్థానంలో ఉండగా, మొదటి స్థానంలో పోలాండ్ నిలిచింది. నేషనల్ బ్యాంక్ ఆఫ్ పోలాండ్ మొత్తం 90 టన్నుల బంగారం కొనుగోలు చేసింది. ఆ దేశం నవంబర్ నెలలోనే ఏకంగా 21 టన్నుల బంగారం కొనడం గమనార్హం. దీంతో ఆదేశం వద్ద గోల్డ్ నిల్వలు 448 టన్నులకు చేరాయి.
ఇక సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్ 2024లో మొత్తం 11 టన్నుల బంగారం కొనుగోలు చేసింది. కజకిస్తాన్ 5 టన్నులు, చైనా 5 టన్నులు, జోర్డాన్ 4 టన్నులు కొనుగోలు చేయగా.. తుర్కియే 3 టన్నుల బంగారం కొనుగోలు చేసింది. ఇక సింగపూర్ మానిటరీ అథారిటీ 2024లో 7 టన్నుల బంగారం విక్రయించింది. దీంతో ఆ దేశం వద్ద 223 టన్నుల బంగారం ఉంది.
ద్రవ్యోల్బణం సమయంలో బంగారం కొనడం ఆర్థికంగా మంచిదని భావిస్తారు. ఇది కాకుండా, డీమోనిటైజేషన్ సమయంలో కూడా దాని విలువ చెక్కుచెదరకుండా ఉంటుంది. ప్రపంచంలో ఆర్థిక అస్థిరత కాలం ఉన్నప్పుడు, బంగారం ఒక సురక్షితమైన సంపదగా పరిగణించబడుతుంది. ప్రపంచ లేదా స్థానిక ఆర్థిక సంక్షోభాల సమయంలో బంగారం ధరలు పెరుగుతాయి. మార్కెట్లు అస్థిరంగా ఉన్నప్పుడు.. ఈక్విటీ మార్కెట్లో అనిశ్చితి ఉన్నప్పుడు, బంగారాన్ని కొనుగోలు చేయడం లాభదాయకమైన ఒప్పందంగా ఆర్థిక నిపుణులు చెబుతున్న మాట.