భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతుంది. ముఖ్యంగా ఇటీవల ఈవీ రంగంలో స్కూటర్లు హవా చూపుతున్నాయి. పెరుగుతున్న పెట్రోల్ ధరల దెబ్బకు సామాన్యులు ఈవీలను ఆశ్రయిస్తున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా పెరుగుతున్న కాలుష్యం నుంచి రక్షణకు ఈవీ వాహనాలపై ప్రత్యేక సబ్సిడీలను వాటిని అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చింది. భారతదేశంలోని ఈవీ ప్రియులను ఓలా స్కూటర్లు అమితంగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్ తన మొదటి ఎలక్ట్రిక్ బైక్ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఆ కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ ఇటీవల సోషల్ మీడియాలో ఒక చిత్రాన్ని షేర్ చేయడంతో ఆ ఫొటో వైరల్గా మారింది. అతి పెద్ద బ్యాటరీ ప్యాక్ వచ్చే ఓలా బైక్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
గతేడాది ఆగస్టు 15న ఓలా ఎలక్ట్రిక్ నాలుగు ఫ్యూచరిస్టిక్ ఇ-మోటార్సైకిల్ కాన్సెప్ట్లను ఆవిష్కరించింది. ఈ డిజైన్లు అప్పట్లో ఈవీ ప్రియులను అమితంగా ఆకట్టకున్నాయి. అయితే అప్పడు డిస్ప్లే చేసిన డిజైన్లకు సంబంధం లేకుండా మరింత కొత్తగా ఈవీ బైక్ను ఓలా లాంచ్ చేస్తున్నట్లు ఆ చిత్రాలను చూస్తుంటే అర్థం అవుతుంది. ఓలా కంపెనీ ఇటీవల మూడు కొత్త ఈ-బైక్ డిజైన్లను పేటెంట్ చేసింది. ఇవి ప్రాక్టికాలిటీలో మరింత ఆకట్టుకుంటాయని కంపెనీల ప్రతినిధులు చెబతున్నారు. భవిష్ అగర్వాల్ షేర్ చేసిన ఫొటో ప్రకారం ఈవీ బైక్ సాధారణంగా ఉండే వాటి కంటే పెద్ద బ్యాటరీ ప్యాక్తో వస్తుందని అర్థం అవుతుంది. ఫ్రంట్ స్ప్రాకెట్, చైన్ ఫైనల్ డ్రైవ్, ఫుట్పెగ్ వంటి అధునాత ఫీచర్లతో ఈ బైక్ను లాంచ్ చేయనున్నారు.
ఓలాకు సంబంధించిన రాబోయే ఎలక్ట్రిక్ మోటార్సైకిల్ అల్ట్రావయోలెట్ ఎఫ్ 77 మ్యాక్ 2, మేటర్ ఎరా వంటి మోడళ్లతో పోటీ పడనుంది. ఓలా ఈవీ బైక్ లాంచ్ చేస్తే భారతదేశ ఆటోమొబైల్ రంగంలో తన ప్రత్యేకతను చాటుకుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఓలా ఇప్పటికే లాంచ్ చేసిన ఎస్-1 ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాల్లో ముందువరుసలో ఉంది. సాధారణంగా ఓలా ప్రతి ఆగస్టు 15న, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భవిష్యత్ ప్రణాళికలను వెల్లడిస్తూ ఉంటుంది. బహుశా ఆ రోజునే ఈవీ బైక్ గురించి గుడ్ న్యూస్ చెప్పే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి