ఎమ్మెల్యే షకీల్ యూ టర్న్..! అసలు రీజన్ ఏంటి..?

| Edited By: Anil kumar poka

Sep 13, 2019 | 2:46 PM

మా పార్టీ ఎంఐఎం చెప్పినట్లు వింటుంది.. నేను మైనార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేను.. 12 శాతం రిజర్వేషన్లు అన్నారు.. కానీ నాకు మాత్రం మంత్రి పదవి ఇవ్వలేదు.. పార్టీలో నాకు సరైన గుర్తింపు లేదు.. ప్రస్తుతం రాజకీయ అంశాలపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌తో భేటీ అయ్యా.. సోమవారం రోజు.. నా అభిప్రాయాన్ని వెల్లడిస్తా.. ఇదంతా గురువారం మధ్యాహ్నం భోధన్ ఎమ్మెల్యే షకీల్ చేసిన వ్యాఖ్యలు.. సీన్ కట్ చేస్తే.. సాయంత్రానికి మా బాస్ కేసీఆర్.. నాకు […]

ఎమ్మెల్యే షకీల్ యూ టర్న్..! అసలు రీజన్ ఏంటి..?
Follow us on

మా పార్టీ ఎంఐఎం చెప్పినట్లు వింటుంది.. నేను మైనార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేను.. 12 శాతం రిజర్వేషన్లు అన్నారు.. కానీ నాకు మాత్రం మంత్రి పదవి ఇవ్వలేదు.. పార్టీలో నాకు సరైన గుర్తింపు లేదు.. ప్రస్తుతం రాజకీయ అంశాలపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌తో భేటీ అయ్యా.. సోమవారం రోజు.. నా అభిప్రాయాన్ని వెల్లడిస్తా.. ఇదంతా గురువారం మధ్యాహ్నం భోధన్ ఎమ్మెల్యే షకీల్ చేసిన వ్యాఖ్యలు.. సీన్ కట్ చేస్తే.. సాయంత్రానికి మా బాస్ కేసీఆర్.. నాకు రాజకీయ బిక్ష పెట్టింది కేసీఆరే.. పార్టీ మారుతానంటూ వస్తున్న వార్తలన్నీ పుకార్లే.. ఎవరో కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్‌ను కాదని నేను ఏం చేయను.. నాకు మూడు సార్లు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించారు. తొలిసారి ఓటమి పాలైనా కూడా మరోసారి ఇచ్చారు. టీఆర్ఎస్‌ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను.. ఇదంతా గురువారం జరిగిన బోధన్ ఎమ్మెల్యే షకీల్ చేసిన వ్యాఖ్యలు. అయితే మొత్తానికి మొన్న జరిగిన కేబినెట్ విస్తరణ టీఆర్ఎస్ పార్టీలో చిచ్చురేపిందని తెలుస్తోంది.

ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో భాగంగా పలువరు ఆశావహులకు చుక్కెదురైంది. అయితే ఇందులో పలువురు మాజీ మంత్రులు కూడా ఉన్నారు. ఇందులో బోధన్ ఎమ్మెల్యే షకీల్ కూడా ఉన్నారు. మైనార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేగా అవ్వడంతో.. మంత్రి పదవి ఖచ్చితంగా దక్కుతుందన్న ఆశతో ఉన్నారు. అయితే ఇప్పటికే మైనార్టీ నుంచి మహమూద్ అలీ హోం మంత్రిగా ఉన్న విషయం తెలిసందే. అయితే మరో మంత్రి పదవి కూడా వస్తుందనుకున్నారు షకీల్. అయితే కేబినెట్ విస్తరణలో ఆయన పేరు లేకపోవడంతో.. తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. అయితే ఈ నేపథ్యంలోనే గురువారం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌ను కలిశారు షకీల్. అయితే ఆయనతో కలిసి ఓ ఫోటో దిగడం.. ఆ తర్వాత మీడియా ముందు ఆయన అసంతృప్తిని వెళ్లగక్కడం జరిగింది. దీంతో ఆయన కారు దిగి.. కమలం గూటికి చేరతున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే మంత్రి పదవి రాకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తూ.. ఇలా చేశారని.. ఇలా చేస్తే.. అధిష్టానం మెట్టుదిగి వస్తుందన్న అభిప్రాయంతో ఇలా చేశారని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే పార్టీ మారుతానంటూ వార్తలు రావడంతో ఆయన వివరణ ఇచ్చుకున్నారు. తన నియోజకవర్గంలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనాలని కోరేందుకు ఎంపీ అరవింద్‌ను కలిశానని.. తాను పార్టీ మారుతున్నట్టు జరుగుతున్న ప్రచారం అంతా అవాస్తవమని అన్నారు. కేసీఆర్ తనకు రాజకీయ గురువు అని వ్యాఖ్యానించారు.

అయితే ఆయనపై గతంలో పలు కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ కేసులను ఇటీవల కేంద్రం తిరగతోడుతుందని.. అందుకే కమలం గూటికే చేరుతున్నారంటూ కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే షకీల్ కమలం గూటికి చేరితే.. పార్టీలో ధిక్కార స్వరం క్రమేపీ పెరుగుతుందని భావించిన పార్టీ.. ఆయనను బుజ్జగించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతడికి నామినేటెడ్ పదవి ఇచ్చేందుకు అధిష్టానం సిద్ధమైనట్లు తెలుస్తోంది. అంతేకాదు పార్టీ అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ కూడా లభించినట్లు సమాచారం. కాగా, మంత్రి పదవులు దక్కకుండా అసంతృప్తికి గురైన పలువురు నేతలకు నామినేటెడ్ పదవులు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్న టీఆర్ఎస్… షకీల్‌కు కూడా నామినేటెడ్ పదవి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల మాజీ హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి కూడా కేసీఆర్ మోసం చేశారంటూ వాఖ్యలు చేసి.. ఆ తర్వాత యూ టర్న్ తీసుకున్నారు. అంతేకాదు మాజీ ఉపముఖ్యమంత్రి రాజయ్య కూడా తన అంసంతృప్తిని వెల్లగక్కారు. అయితే ఇలా అసంతృప్తులందరికీ నామినేటెడ్ పదవులు ఇచ్చి బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి పార్టీలో మాత్రం కేబినెట్ విస్తరణ అంశం చిచ్చురేపినట్లు స్పష్టం అవుతోంది. మరి సోమవారం అభిప్రాయం చెప్తానన్న షకీల్.. ఏమైనా చెప్తారా.. లేదా వేచి చూడాలి మరి.