పెళ్లి విషయంలో మోసపోయిన ఓ యువతి సెల్ టవర్ ఎక్కింది. తనకు న్యాయం జరగకపోతే అక్కడ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. వరంగల్ జిల్లా పెగడపల్లిలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. పెగడపల్లికి చెందిన దామర మాలిక అనే యువతికి తొమ్మిదేళ్ల కిందట మోషే అనే యువకుడు పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. కొత్తగూడెంలో టీఎస్ జెన్కోలో విధులు నిర్వహిస్తున్న మోషే.. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికినట్లు చెబుతోంది.
తొమ్మిదేళ్లుగా చెట్టాపట్టాలేసుకొని తిరిగి ఇప్పుడు ముఖం చాటేశాడంటూ మాలిక ఆవేదన వ్యక్తం చేస్తోంది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో మంగళవారం (మార్చి 5) ఉదయం సెల్ టవర్ ఎక్కింది. గ్రామస్తులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మాలికకు నచ్చజెప్పి కిందకి దింపే ప్రయత్నం చేశారు. నాలుగు గంటలకు పైగా సెల్ టవర్పైనే ఉన్న యువతి అధికారులకు ముచ్చెమటలు పట్టించింది.
విషయం తెలుసుకున్న ప్రియుడు మోషే, అతడి కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి పరారైనట్లు తెలుస్తోంది. చివరికి మాలికకు నచ్చజెప్పిన అధికారులు ఆమెను సురక్షితంగా కిందకి తీసుకొచ్చారు. పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి వివరాలు సేకరిస్తున్నారు.