ధ్వజారోహణంతో తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఆదివారం రాత్రి ముగిశాయి. కరోనా నేపథ్యంలో చరిత్రలో తొలిసారి ఏకాంతంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. ఇక రేపటి నుంచి (29వతేదీ) తిరుమలలో షోడశదిన సుందరకాండ దీక్ష జరుగనుంది. అక్టోబర్ 14 వరకు వసంత మండపంలో ఈ దీక్ష నిర్వహిస్తారు. ఇందుకుగాను ఈరోజు రాత్రి (సెప్టెంబర్ 28న) 7 గంటలకు ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో అంకురార్పణ జరుగనుంది. లోక కల్యాణార్థం 16 రోజుల పాటు నిష్ణాతులైన వేద పండితులతో టీటీడీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఇక, అక్టోబర్ 16 నుంచి 24 వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.
కోరిన కోర్కెలు తీర్చే కొండంత దేవుడు శ్రీనివాసుడి చెంతకు కరోనా లాక్డౌన్ నేపథ్యంలో భక్తుల రద్దీ తగ్గిపోయిన సంగతి తెలిసిందే. దీంతో వేంకటేశ్వరుడి హుండీ ఆదాయం ఇటీవల బాగా తగ్గింది. అయితే లాక్డౌన్ తర్వాత మొదటిసారి తిరుమలలో ఒక్కరోజు ఆదాయం 2 కోట్లు దాటింది. ఆదివారం భక్తులు 2 కోట్ల 34 లక్షల రూపాయలు స్వామివారికి సమర్పించుకున్నారు. మళ్లీ ఇప్పుడిప్పుడే తిరుమలకు భక్తుల రాక పెరుగుతోంది. ఆదివారం 12 వేల 655 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 4,121 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.