నేపాల్లో కురుస్తున్న భారీ వర్షాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు . ఈ వర్షాల ధాటికి చాలా జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల జనం నిరాశ్రయులయ్యారు. కొండప్రాంతాల్లో ఉండే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చాలా చోట్ల భారీగా కొండచరియలు విరిగిపడడంతో జనం మృత్యువాతపడుతున్నారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భారీగా కొండచరియలు విరిగి నివాస స్థలాలపై పడడంతో చాలా ఇళ్లు నేలమట్టమయ్యాయి. దీంతో చాలామంది వాటికింద చిక్కుకుపోయినట్లు అధికారులు తెలిపారు. కస్కీ జిల్లాలో చాలా ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ ఘటనల్లో ఇప్పటికే 12మంది మృతిచెందగా మరో 19మంది జాడ కనిపించకుండా పొయిందని స్థానికులు తెలిపారు. ఇప్పటివరికు 44మంది గల్లంతైనట్లు గుర్తించామని, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. శిథిలాల చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేశామని అధికారులు తెలిపారు. ముఖ్యంగా పొఖారా పట్టణానికి సమీపంలోని సారంగ్కోట్, హేమ్జాన్ ప్రాంతాల్లో ఎక్కువగా కొండచరియలు విరిగి పడినట్లు అధికారులు తెలిపారు. మ్యాగ్డీ జిల్లాలోనూ కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో మరో 12మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లోనూ ప్రత్యేక బృందాలతో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది. కొండ ప్రాంతాల్లో ఉన్న మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది.