ఈఎస్ఐ స్కామ్ కేసులో అరెస్టయి ప్రస్తుతం జ్యూడిషియల్ రిమాండ్లో వున్న తెలుగుదేశం నేత అచ్చెన్నాయుడు మరో నాలుగు రోజులు ప్రస్తుత పరిస్థితినే భరించాల్సి వుంటుంది. టెక్కలిలో అరెస్టయి నాలుగు రోజుల క్రితం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి చేరిన అచ్చెన్నాయుడు ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆయనకు సోమవారం ప్రభుత్వాసుపత్రి వైద్యుల బృందం మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించింది.
గుంటూరు జీజీహెచ్లో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడి పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు తెలిపారు. అయితే ఆయనకు మరో మూడు-నాలుగు రోజులు రెస్ట్ అవసరమని తెలిపారు. నాలుగు రోజుల పాటు ఆయనకు ప్రస్తుతం ఇస్తున్న చికిత్సనే అవసరం అని వైద్యుల బృందం తెలిపింది. ప్రస్తుతం ఆయన ఈఎస్ఐ స్కాంలో అరెస్టయ్యారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే అచ్చెన్నాయుడిని జ్యూడిషియల్ రిమాండ్కు తరలించనున్నారు.0
మరోవైపు అచ్చెన్నాయుడిని టీడీపీ నేతలు పరామర్శిస్తున్నారు. ఈరోజు ఉదయం గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఆయనను కలిసేందుకు వచ్చారు. కాని.. గల్లాను అచ్చెన్నతో కలిసేందుకు ఆస్పత్రి సూపరింటెండెంట్ పర్మిషన్ ఇవ్వలేదు. కోర్టు అనుమతి లేనిదే అచ్చెన్నాయుడుని కలిసే అవకాశం లేదని వారు తెలిపారు. శనివారం అచ్చెన్నను పరామర్శించేందుకు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబును సైతం పోలీసులు అనుమతించని విషయం తెలిసిందే.
మరోవైపు అచ్చెన్నాయుడు వ్యవహారంపై ఏసీబీ కోర్టులో సోమవారం నాడు రెండు పిటిషన్లు దాఖలు చేశారు న్యాయవాదులు. అచ్చెంనాయుడుకి బెయిల్ మంజూరు చేయాలంటూ ఓ పిటిషన్ దాఖలు కాగా.. ఆయనకు మెరుగైన వైద్య చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలని మరో పిటిషన్ దాఖలైంది.