Kanakamedala Ravindra Kumar : రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారని, వ్యక్తులుగా నిర్ణయాలు తీసుకోరని జగన్ ప్రభుత్వం గుర్తించాలని టీడీపీ రాజ్యసభపక్ష నేత కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు. చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ కేసులను పెట్టడం దుర్మార్గపు కక్షపూరిత రాజకీయ క్రీడ అని ఆయన అభివర్ణించారు. ఎఫ్ఐఆర్ లో పెట్టిన కేసులు అన్నీ వైఎస్ఆర్, జగన్ లకూ వర్తిస్తాయని గుర్తించాలన్నారు కనకమేడల. “ఆనాడు ఎస్సైన్డ్ భూములను వైఎస్ఆర్ ఆధీనంలో ఉంచుకున్నారు. చంద్రబాబు సీఎంగా ప్రభుత్వం తరపున జీవో ఇచ్చారు కానీ ఆయన ఆధీనంలో ఉంచుకోలేదు. పాలనాపరమైన నిర్ణయం తీసుకుంటే అదేదో భూములు కొట్టేసినట్లు కేసులు పెడితే ఎలా నిలబడతాయి. జగన్ కు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో మీరు చేస్తున్న భూ సేకరణపై దర్యాప్తు చేయించాలి. దేశంలో ఎక్కడా కూడా ఇలాంటి కక్ష రాజకీయాలు లేవు. ఈ 20 నెలల పాలనలో జగన్ పై 50 కేసులు పెట్టాలి. సుప్రీంకోర్టు కూడా చాలా సార్లు జగన్ ప్రభుత్వంపై మొట్టికాయలు వేసింది. జగన్ ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయంలో కుట్రకోణం ఉంది. వైఎస్సార్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులకు జగన్, అధికారులు ఇంకా కేసుల చుట్టూ తిరుగుతున్నారు. గత ప్రభుత్వాల నిర్ణయాలను అన్నింటినీ సమీక్షవచ్చని ఒక జీవో ఇవ్వండి. ప్రతిపక్షం లేకుండా చేయాలని ఇలాంటి కుట్రలు చేస్తున్నారు.” అంటూ కనకమేడల ప్రశ్నలు సంధించారు.