Andhra Pradesh: మాట వినడం లేదనీ గుంజీలు తీయించిన ప్రిన్సిపల్‌.. 50 మంది విద్యార్ధినులు అస్వస్థత

|

Sep 17, 2024 | 9:55 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలంలోని ఏపీఆర్‌ జూనియర్‌ కాలేజీ ప్రిన్సిపల్ క్రమశిక్షణ పేరిట విద్యార్ధులను చిత్ర హింసలకు గురిచేస్తున్నారు. విద్యార్థినులు తన మాట వినడం లేదని కఠిన శిక్ష విధించారు. వరుసగా మూడు రోజుల పాటు వారిని గుంజీలు తీయాలని హుకూం జారీ..

Andhra Pradesh: మాట వినడం లేదనీ గుంజీలు తీయించిన ప్రిన్సిపల్‌.. 50 మంది విద్యార్ధినులు అస్వస్థత
Sit Ups Punishment
Follow us on

రంపచోడవరం, సెప్టెంబర్‌ 17: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలంలోని ఏపీఆర్‌ జూనియర్‌ కాలేజీ ప్రిన్సిపల్ క్రమశిక్షణ పేరిట విద్యార్ధులను చిత్ర హింసలకు గురిచేస్తున్నారు. విద్యార్థినులు తన మాట వినడం లేదని కఠిన శిక్ష విధించారు. వరుసగా మూడు రోజుల పాటు వారిని గుంజీలు తీయాలని హుకూం జారీ చేశారు. నాలుగో రోజున ఆ బాలికలు కాళ్ల నొప్పులు తట్టుకోలేక తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వివరాల్లోకెళ్తే..

రంపచోడవరం మండలంలోని ఏపీఆర్‌ జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థినులు తాము చెప్పిన మాట వినడం లేదని ప్రిన్సిపల్‌ ప్రసూన, పీడీ కృష్ణకుమారి భావించారు. దీంతో వారిని సరైన మార్గంలో పెట్టేందుకు శుక్రవారం నుంచి వారితో రోజుకు 100 నుంచి 200 వరకు గుంజీలు తీయించారు. ఇలా వరుసగా మూడు రోజుల పాటు బాలికలు గుంజీలు తీశారు. ఈ క్రమంలో సోమవారం కూడా అలాగే గుంజీలు తీయడంతో దాదాపు 50 మంది వరకు విద్యార్థినులు కాళ్ల నొప్పులతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొంతమంది బాలికలు తమ తల్లిదండ్రులకు ఈ విషయం తెలపడంతో.. వారు కాలేజీకి చేరుకుని విద్యార్థినులను స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధిత విద్యార్ధినులు అంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సాయంత్రానికి కోలుకోవడంతో కొందరిని ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్‌ చేసి, ఇంటికి పంపించారు.

స్థానిక ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్ధినులను స్థానిక ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి పరామర్శించారు. దీనిపై వెంటనే విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించారు. క్రమశిక్షణ పేరుతో విద్యార్థినులను గుంజీలు తీయించడం దారుణమైన చర్య అని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి అన్నారు. విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ పీవో కట్టా సింహాచలానికి ఎమ్మెల్యే సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.